దేశంలో కాంగ్రెస్ సీనియర్లు గ్రూప్-23 అని ఒక బ్యాచ్ గా ఏర్పడ్డారు. వీళ్ల పని ఏమంటే.. ఎప్పుడైతే దేశంలో ఎన్నికలు జరుగుతాయో.. అప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఆ మీటింగ్ లో కాంగ్రెస్ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తారు. పార్టీలో పద్ధతులు బాగాలేవంటూ గోల చేస్తారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోతారు. వీళ్లు కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నారా? ఇందులో ఉండి.. బీజేపీ కోసం పనిచేస్తున్నారా? అన్నది అర్థకాకుండా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
ఇప్పుడు.. తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేతగా చెప్పుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుకూడా అచ్చం ఇదే విధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ రెండు సార్లు అధికారం కోల్పోయింది. మరి, పార్టీని బాగు చేసుకునేందుకు ఏం ప్రయత్నం చేశారు అని సీనియర్లను అడిగితే.. మౌనమే సమాధానంగా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. వీళ్లతో లాభం లేదని భావించిన అధిష్టానం.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది.
దీన్ని జీర్ణించుకోలేకపోతున్న సీనియర్లు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో తమ ఉక్రోషం వెళ్లగక్కుతూనే ఉన్నారు. రేవంత్ కు పీసీసీ ప్రకటించిన తర్వాత ఆవేశం ఆపుకోలేకపోయిన కోమటిరెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ కూడా టీటీడీపీగా మారిపోతుందని అన్నారు. ఆ తర్వాత బీజేపీ నేతల వద్దకు వెళ్లి వినతిపత్రాలు సమర్పించుకున్నారు. అనంతరం షర్మిల పార్టీ నుంచి తనకు ఆహ్వానం ఉందని చెప్పుకోజూశారు. ఇప్పుడు హుజూరాబాద్ లో తాను సర్వే చేశానని.. కాంగ్రెస్ పార్టీకి 5 శాతానికి మించి ఓట్లు రావని చెప్పుకొచ్చారు.
ఈయన తీరు చూసిన నిజమైన కాంగ్రెస్ వాదులు మండిపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని బాగుచేయడానికి చూస్తున్నారా? ఇంకా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనే ఏ పార్టీ అయినా.. విజయం తమదేనని ప్రకటించుకుంటుంది. ప్రత్యర్థులను ఢీకొట్టి గెలవబోతున్నామని చెప్పుకుంటుంది. కానీ.. కోమటి రెడ్డి మాత్రం తన పార్టీ ఓడిపోతుందని ప్రకటించడం అందరినీ విస్మయ పరుస్తోంది. ఆ మధ్య హుజూరాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోవాలని రేవంత్ కు సవాల్ చేశారాయన. ఇందులో భాగంగానే.. పార్టీ శ్రేణుల స్థైర్యం దెబ్బతీసేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి, దీనికి కోమటిరెడ్డి ఏం చెబుతారో?