తెలంగాణ నుంచి పెద్దలసభకు ఎవరు వెళ్లనున్నారు అనే విషయంలో ఉత్కంఠ వీడింది. తెరాస తరపున రాజ్యసభకు వెళ్లే ఆ ఇద్దరు ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావుతో పాటు అసెంబ్లీ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేశారు. కేకే కి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించిన సీఎం కెసిఆర్… రెండో అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బండి పార్థసారథిరెడ్డి పేర్లను పరిశీలించిన సీఎం సుదీర్ఘ కసరత్తు చేసి చివరకు సురేష్ రెడ్డి కు అవకాశం కల్పించారు.
రేపు ఉదయం 12 గంటలు ఈ ఇద్దరు నేతలు రాజ్యసభకు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నిజానికి తెరాస తరపున పెద్దల సభకు వెళ్లే వారు ఎవరనే దానిపై కొన్ని నెలలుగా ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ మాజీ ఎంపీ కవితకు రాజ్యసభ సీటు ఖాయమనే ఊహాగానాలు మొదట్లో వినిపించాయి. అయితే కవితను పరోక్ష ఎన్నికల ద్వారా చట్టసభలకు పంపించే యోచనలో కేసీఆర్ లేరని… అందుకే ఆమెకు రాజ్యసభ ఛాన్స్ ఉండదనే ప్రచారం జరిగింది.
సామాజిక సమీకరణాలు, జాతీయ స్థాయిలో రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కెసిఆర్ రాజ్యసభ అభ్యర్థులను ఎంపిక చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.