ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విశాఖ వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రకటనలు చేయిస్తున్నారు. కోర్టు తీర్పు తేలే వరకు ఉండడం లేదని సమాచారం. సీఎం ఎక్కడి నుంచి పరిపాలన ప్రారంభిస్తే అక్కడే క్యాంపు ఆఫీసు చూసుకోనున్నారు. రాజధాని తరలింపు వ్యవహారం సాంకేతికపరంగా చెప్పకపోయినా తాడేపల్లిలో ఉండడానికి ఇష్టపడడం లేదు.
తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి సమీపంలో పేదల కాలనీలు ఉండకూడదనే ఉద్దేశంతో అక్కడ ఉన్నకాలనీలను ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ ఇల్లు ఓ రెండు ఎకరాల స్థలంలో ఉంది. రియల్ ఎస్టేట్ కంపెనీ అభివృద్ధి చేసిన లే అవుట్ లో ఆకర్షణీయంగా ఉంది. అయితే అక్కడే ముప్పై ఏళ్లుగా అమరారెడ్డి నగర్ అనే కాలనీ ఉంది.
నిరుపేదలు ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు జగన్ అక్కడ ఇల్లు కట్టుకోవడం వారికి శాపంగా మారింది. వారిని ఖాళీ చేయాలని అధికారులు బెదిరిస్తున్నారు. అన్ని సదుపాయాలతో ఇళ్లు కట్టుకున్నాక వెళ్లిపోవాలంటే ఎక్కడికి వెళ్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఇళ్లు ఖాళీచేసి వెళ్లిపోయేవారికి మంగళగిరి పరిధిలోని ఆత్మకూరు వద్ద రెండు సెంట్ల భూమి చూపించారు. కానీ ఏళ్ల తరబడి చేసిన కష్టంతో కట్టుకుని ఇంటిని వదిలేసి అక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వ సాయం మాటల్లోనే ఉంది.
దీంతో ఎవరూ వెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఇది వివాదాస్పదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాళ్లు కాలువ కట్ట మీదే ఇళ్లు కట్టుకుని ఉండవచ్చు కానీ అలా ఏమీ చూపించకుండా ఖాళీ చేయించడం, కూల్చివేయడం సరికాదన్న చర్చ జరుగుతోంది. అసలు జగన్ తాడేపల్లిలోనే ఉండదల్చుకోలేనప్పుడు ఎందుకు కాలనీని ఖాళీ చేయిస్తున్నారని ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం అవుతోంది.