ఒక వంక పోతిరెడ్డిపాడు జల సామర్ధ్యాన్ని రెట్టింపు చేసే ప్రయత్నంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తీవ్ర స్థాయికి వెళ్ళేటట్లు చేసిన ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మరో పేచీకి సిద్దపడుతున్నరు. అంతకు మించి ఏకంగా శ్రీశైలం రిజర్వాయర్ వెనుక నుంచి కృష్ణ నదిలోనే పంప్ హౌస్ ఏర్పాటు చేసి శ్రీశైలం వరకు నీరు రాకుండా తరలించుకునేందుకు పధకం వేసిన్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి.
పోతిరెడ్డిపాడుకు నాలుగు కిలోమీటర్ల దూరం నుంచే నీటిని లిఫ్ట్ చేసుకొని పోయే డైవర్షన్ స్కీమ్ కు రంగం సిద్ధం చేస్తున్నారు. సంగమేశ్వరం నుంచే రోజుకు మూడు టీఎంసీల నీటిని పంపింగ్ చేసేందుకు అనుమతులు ఇచ్చింది.
ఎగువ ప్రాంత వరద జలాలను వాడుకుంటామని, అంటే.. కృష్ణా నదికి వరదలొచ్చినపుడు శ్రీశైలం నుంచి పొంగిపొర్లే జలాలను వాడుకుంటామని చెబుతున్న జగన్ ప్రభుత్వం ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్లో కనీస నీటిమట్టం లేకుండా కాజేసేందుకు అనుమతులు ఇచ్చిందని తెలంగాణ ఇంజినీర్లు మండిపడుతున్నారు.
దీంతో శ్రీశైలం దాటి కృష్ణా జలాలు కిందికి రావటం సాధ్యం కాదని, దానితో శ్రీశైలం నీటి ఆధారంగా తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులన్నీ వట్టిపోగలవని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా నాగార్జునసాగర్ కు కూడా నీరు రావడం కష్టం కాగలదు.
శ్రీశైలం రిజర్వాయర్ నిండి పొంగితే, అంటే పూర్తి నీటి మట్టం 885 అడుగులు దాటితేనే దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు నీరు వెళ్లడం గాని జరుగుతుంది. కానీ ఇప్పుడు శ్రీశైలం గేట్లకు దిగువన ఉన్న నాగార్జునసాగర్ నిండాలి. అప్పుడే వరద జలాలుగా పరిగణించ వలసి ఉంటుంది.
సగటున ప్రతి ఐదేళ్లలో ఒక్క ఏడాది మాత్రమే కృష్ణాకు వరదలొస్తున్నాయి. మిగతా నాలుగేళ్లు కృష్ణా బేసిన్లో అంతకంతకు సరిపడే నీళ్లే ఉంటున్నాయి. కృష్ణా బోర్డు సమక్షంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ లో కనీస నీటి నిల్వమట్టం 834 అడుగులు మెయింటెన్ చేయాలి.
కానీ పోతిరెడ్డిపాడు నుంచి లెక్కలేనన్ని నీళ్లను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతోంది. నీటి మట్టం .. 790 అడుగులకు పడిపోయినా కూడా .. ఉన్న నీరంతా ఖాళీ చేసేలా పంపింగ్ స్కీమ్ ను జగన్ ప్రభుత్వం డిజైన్ చేసుకున్నట్లు తెలంగాణ ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. దీంతో సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు నుంచి నీరు గలగల పారుతుంటే శ్రీశైలం చుక్కనీరు లేకుండా ఖాళీ కావటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.