ఆంధ్రప్రదేశ్లో మరోసారి ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘం అన్నట్లుగా యుద్ధ వాతావరణం కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే మళ్లీ ఆ పరిస్థితి రాక తప్పదనే అర్థమవుతోంది. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో వద్దు అంటూ ప్రభుత్వం మొత్తుకుంటున్నా.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం ఎన్నికలు నిర్వహించడమే అని పట్టుబడుతున్నారు.
Also Read: విశాఖ మెట్రో ప్రారంభం..
పంచాయతీ ఎన్నికలపై ఇదివరకు హైకోర్టులో దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఎన్నికల నిర్వహణపై ఇబ్బందులు ఏంటని హైకోర్టు ఎస్ఈసీని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల నిర్వహణ గురించి రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు.
అయితే దానికంటే ముందే జగన్ సర్కార్ పావులు కదిపింది. సోమవారం రాత్రి హుటాహుటిన కరోనా వైరస్ నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ భేటీ ఏర్పాటు చేసింది. సమావేశంలో ప్రధాన సలహాదారు అజేయకల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. సమావేశం సారాంశం కరోనా టార్గెట్ అని చెబుతున్నా.. ప్రధానంగా స్థానిక ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా చర్చించినట్టు తెలిసింది.
అయితే.. ఎస్ఈసీ సమావేశం నేపథ్యంలో జగన్ ఈ సమావేశాన్ని చాలా రహస్యంగా నిర్వహించారు. భేటీ తర్వాత అధికారులు కూడా మీడియాతో మాట్లాడలేదు. బుధవారం జరిగే ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశాన్ని వైసీపీ బహిష్కరించేందుకే రెండు రోజుల ముందు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వపరంగా మాత్రం కరోనా వైరస్ వల్ల ఎన్నికల నిర్వహించడం కష్టమని చెప్పేందుకు ఎస్వోపీ భేటీ ఏర్పాటు చేసి ఉంటారని అర్థమవుతోంది.
Also Read: ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్..
మరోవైపు.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం లేదని అందరికీ తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి పాత ఆర్డినెన్స్ కాలం చెల్లగా.. ఇప్పటికే జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసే అవకాశం ఉంది. అయితే ఏ చట్టం ప్రకారం ఎన్నికలు జరపాలనే సందిగ్ధత కూడా ఉంది. దీనిని సవాల్ చేస్తూ అభ్యర్థులు కోర్టుకు వెళితే.. విషయం తేలడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అంటే కనీసం 5 నెలలు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ముగిసి.. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చేవరకు స్థానిక ఎన్నికలు నిర్వహించరని తెలుస్తోంది. మరి ఈ అనిశ్చితికి న్యాయస్థానాలు పరిష్కారం చెబుతాయో చూడాలి.