జగన్ – విజయసాయిరెడ్డి.. వీళ్లిద్దరి మధ్య ఉన్న బంధం ఎంత బలమైనదో అందరికీ తెలిసిందే. సీబీఐ కేసుల ఇన్వెస్టిగేషన్ సమయంలో నుంచి వీరి రిలేషన్ మరింత స్ట్రాంగ్ అయ్యింది. నిజానికి.. విజయసాయి ఫేమస్ అయ్యింది కూడా ఈ కేసుల విచారణ తర్వాతనే. ఆ సమయంలో ఎంత వరకు సమాధానాలు చెప్పాలో అంత వరకే చెప్పారని, అధికారులు ఎన్నివిధాలుగా తిప్పి ప్రశ్నించినా.. అనుకున్న ఆన్సర్లు మాత్రమే ఇచ్చారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. దీంతో జగన్ కు పూర్తి అనుకూలుడిగా మారిపోయారు. ఆ తర్వాత పార్టీ కార్యకలాపాల్లోకి రావడం.. జగన్ మనసెరిగిన నేతగా మారిపోవడం.. నాటి ప్రభుత్వంపై జగన్ తర్వాత కీలకమైన విమర్శలు చేయాల్సి వస్తే అది విజయసాయే చేస్తూ రావడంతో.. వైసీపీలో కీలక నేతగా మారిపోయారు.
ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. విజయసాయి ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది. ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నేతగా చక్రం తిప్పుతున్నారు. అంతేకాదు.. ఉత్తరాంధ్రలో పార్టీ బాధ్యతను కూడా విజయ సాయికే అప్పగించారు జగన్. దీంతో.. తనకు ఎదురు లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, ఓ సామంత రాజులా వ్యవహరిస్తున్నారనే పేరు వచ్చింది. ఈ పరిస్థితి ముదరడంతో.. జగన్ తో గ్యాప్ కూడా వచ్చిందని అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి తిరుగులేని ఫలితాలు వచ్చాయి. మునిసిపల్ ఎన్నికల్లోనూ అన్ని చోట్లా జెండా ఎగరేసింది. కానీ.. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన విశాఖలో అత్తెసరు సీట్లే దక్కాయి. ఇక్కడ బాధ్యతలు చూస్తున్న విజయసాయి.. 90 శాతం సీట్లు మనవే అని చెప్పారట. ఫలితాల తర్వాత మొత్తం తలకిందులు కావడంతో.. జగన్ అసహనం వ్యక్తం చేశారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చలోకి వచ్చిన మాన్సాస్ ట్రస్టు వివాదానికి కూడా విజయసాయిరెడ్డే కారణమని అంటున్నారు. మాన్సాస్ చైర్ పర్సన్ మార్పు విషయంలో ఓ స్వామీజీ చెప్పిన మాటను పట్టుకుని ఆయన.. ఇంత దాకా తెచ్చారని అంటున్నారు. ఆ విధంగా పార్టీకి.. ఏ మాత్రం సంబంధం లేని, అసలు అలాంటి ఆలోచనే చేయని విషయాన్ని నెత్తిమీదకు తెచ్చారని అంటున్నారు.
రాజకీయంగా వైసీపీకి ఇది ఇబ్బందికర పరిణామమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. న్యాయస్థానం కూడా ఈ విషయమై ప్రభుత్వానికి వ్యతిరేక వ్యాఖ్యలే చేసింది. విపక్షాలతోపాటు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం ఉంది. కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా ఈ విషయంలో జగన్ కు బహిరంగ లేఖ రాయడం.. విజయ సాయిరెడ్డి తీరును తప్పుబట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇన్ని కారణాలతో.. జగన్ కు విజయసాయికి మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. మరి, దీని తీవ్రత ఎంత? వచ్చే ఏడాది పదవీ కాలం ముగియబోతున్న ఆయనకు రాజ్యసభ సీటు కేటాయిస్తారా? లేదా? అనే చర్చ కూడా ఉంది. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Jagan dissatisfied on vijaya sai reddy work
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com