
వైద్యారోగ్య శాఖను తన నుంచి సీఎం కేసీఆర్ కు బదిలీ చేయడం పై ఈటల రాజేందర్ స్పందించారు. మెరుగైన సేవలు అందించేందుకే ఆ శాఖను తన నుంచి తప్పించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎం కు ఉంటుందని ఏ మంత్రినైనా తొలగించే అధికారం కూడా సీఎంకు ఉంటుందన్నారు.
మంత్రి పదవి ఉన్నా లేకున్నా వ్యక్తిగతంగా ప్రజలకు ఎప్పుడూ తోడుంటానని ఈటల తెలిపారు. ఓ ప్రణాళిక ప్రకారమే తనపై దాడి జరుగుతోందని ఆరోపించారు. తాను ఉద్యమకాలం నుంచి ఆత్మగౌరవంతో బతుకుతున్నానని.. ఇప్పుడూ అలాగే మచ్చపడకుండా ఉంటానన్నారు. తనపై విచారణ జరుపుకోవచ్చని సలహా ఇచ్చారు.
‘సీఎంకు శాఖలపై సర్వాధికారాలు ఉంటాయి.ఆయన ఏ శాఖ అయినా తీసుకోవచ్చు.. బదిలీ చేయవచ్చని ఈటల తెలిపారు. ప్లాన్ ప్రకారమే నాపై భూ కబ్జా ఆరోపణలు చేశారు. వాస్తవాలు త్వరలోనే తేలుతాయి. నా నియోజకవర్గ ప్రజలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తా. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి’ అని ఈటల మీడియాతో మాట్లాడాలి.
సీఎం కేసీఆర్ తో ఇప్పటివరకు మాట్లాడే ప్రయత్నం చేయలేదని.. ఇకపై చేయబోనని ఈటల స్పష్టం చేశారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదిక వచ్చాకే స్పందిస్తానన్నారు. తన శాఖను కేసీఆర్ కు బదిలీ చేసినట్లు తెలిసిందని.. ఇందుకు సంతోషిస్తున్నానని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని కోరుకుంటున్నానని తెలిపారు.