తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు రావడం రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది. సామాన్య జనంతోపాటు రాజకీయ నేతల్లోనూ సంచలనం రేకెత్తించింది. అయితే.. ఈ వ్యవహారంలో మంత్రి ఈటలకు పెద్దగా మకిలీ అంటినట్టుగా కనిపించట్లేదు. మీడియా కథనాలు ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈటలకు పెద్ద ఎత్తున మద్దతు కనిపిస్తోంది. ఇదంతా.. ఉద్దేశపూర్వకంగానే సాగుతోందంటూ విశ్లేషణలు రాసుకొస్తున్నారు నెటిజన్లు.
ఈ విషయంలో సాధారణ జనంతోపాటు తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పాల్గొన్నవారంతా ఈటలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. టీఆర్ఎస్ మొదలైన నాటినుంచి ఏదో ఒక ఆరోపణలతో బయటకు పంపివేయబడ్డ నేతల జాబితాను కూడా బయటకు తీస్తున్నారు.
టీఆర్ఎస్ కొత్తలో ఆలె నరేంద్ర, ఆ తర్వాత విజయశాంతి, మంత్రి రాజయ్య వంటి వారు ఏదో ఒక ఆరోపణలతో టీఆర్ఎస్ నుంచి బలవంతంగా బయటకు నెట్టివేయబడినవారే. ఇప్పుడు ఈటలను కూడా వారి జాబితాలో కలిపేందుకు చూస్తున్నారని చాలా మంది సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పనిచేసిన నేతల్లో ఈటల రాజేందర్ పేరు తప్పకుండా ఉంటుందని, అలాంటి నేతపై అభాండాలు వేసే కుట్ర జరుగుతోందని పలువురు సోషల్ మీడియాలో అభిప్రాయ పడుతున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం కావాలనే ఇదంతా చేస్తోందని సింహభాగం ప్రజలు ఓ అంచనాకు వచ్చేసినట్టు చెబుతున్నారు.
కాగా.. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి ఈటల ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఎక్కడా ఆయన ఆవేశ పడలేదు. తనపై కుట్ర జరుగుతోందని ఎక్కడా అనలేదు. నిజాల్ని బయటపెట్టండి అని మాత్రమే కోరారు. దీంతో.. ఈటలకు మరింత సానుభూతి పెరిగిందని, ఆయనకు మద్దతు కూడా మరింతగా పెరిగిందని విశ్లేషిస్తున్నారు.
మీడియాను అడ్డం పెట్టుకొని నిందలు వేస్తే.. జనం నమ్మే రోజులు పోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. గతంలో అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అండగా నిలిచే శ్రేణులు కూడా.. ఈటల విషయంలో మాత్రం మద్దతు తెలపలేకపోతున్నారని అంటున్నారు.
ఇప్పటికే ఉద్యమంలో పాల్గొని.. గుర్తింపు దక్కనివారు ఆవేదనలో ఉన్నారు. ఇప్పడు ఈటలపైనా బురద జల్లేందుకు ప్రయత్నిస్తుండడంతో నివురుగప్పిన నిప్పు బలంగా రాజుకోవడం ఖాయమని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. వ్యూహం ఎదురు తిరిగిందా? అనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి. మరి, ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.