Union Budget: కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ పై అన్ని పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఈ బడ్జెట్ వల్ల ఎవరికీ ఉపయోగం లేదని, అంకెల గారడి తప్ప బడ్జెట్లో ఏమిలేదని ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు గుప్పించింది. కరోనా సమయంలో ఉపాధి, ఆరోగ్యానికి బడ్జెట్లో భారీ నిధులు కేటాయించక పోవడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు.
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర బడ్జెట్ పై ఓ రేంజులో ఫైర్ అయ్యారు. రెండున్నర గంటలపాటు ప్రెస్ మీట్ నిర్వహించిన కేంద్ర సర్కారును ఏకిపారేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అధర్మ బడ్జెట్, సోల్లు కబుర్లు చెప్పే బడ్జెట్ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సైతం కేంద్ర బడ్జెట్, సీఎం కేసీఆర్ తీరుపై విమర్శలు గుప్పించారు.
జనసేన మాత్రం బీజేపీ బడ్జెట్ ను కొంతమేర స్వాగతించింది. అయితే ఆశించిన మేర బడ్జెట్ లేదని మాత్రం పవన్ కల్యాణ్ నిట్టూర్చారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు మాత్రం కేంద్ర బడ్జెట్ పై మింగలేక కక్కలేక అన్నట్లుగా మాట్లాడుతూ కుస్తీలు పడుతున్నారు. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారాల తరబడి ఢిల్లీలో కూర్చుని మాకు అది ఇవ్వండి.. అది ఇవ్వండని కోరినా బడ్జెట్లో రూపాయి కూడా విదల్చలేదు.
ఇప్పటికే అప్పుల్లో కురకపోయిన ఏపీకి తాజాగా బడ్జెట్ ఏపీకి శరాఘాతమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రానికి ఏమాత్రం చేయూత నిచ్చే దిశగా బడ్జెట్లో కేటాయింపులు లేవని అంటున్నారు. అన్నివిధలా బడ్జెట్ పై విమర్శలు వస్తున్న సమయంలో వైసీపీ నాయకులు బడ్జెట్ పై పెద్దగా మాట్లాడకపోవడం విడ్డూరంగా మారింది. దీంతో కేంద్ర బడ్జెట్ ను వైసీపీ సర్కారు స్వాగతిస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ గంటల వ్యవధిలనే స్పందించారు. ఏపీ సీఎం మాత్రం ఎన్ని గంటలైనా ఆయన స్పందించ లేదు. దీంతో మౌనం అర్ధాంగీకారం అన్నట్లుగా ఆయన బడ్జెట్ ను స్వాగతిస్తున్నారనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. సీఎం జగన్ ఇప్పటి వరకు కేంద్రం ఏం చేసినా.. దాదాపు అంగీకరిస్తూనే ఉన్నారు.
కేంద్రానికి తొలి నుంచి ఆయనే అండగానే ఉంటూ ఇప్పుడు బడ్జెట్ విషయంలోనే ఆయన అదే చేస్తున్నారు. దీంతో జగన్ కు రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమా? అంటూ పలువురు నిలదీస్తున్నారు. ఈ విమర్శలను జగన్ సర్కార్ ఎలా తిప్పికొడుతుందో వేచిచూడాల్సిందే..!
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More