Homeజాతీయ వార్తలుతెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కాలదన్నుతున్నారు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కాలదన్నుతున్నారు


ఓ వైపు కరోనాతో రాష్ట్రమంతటా నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. ఏం కంపెనీలో చూసినా కరోనా సాకుగా చూపి ఉద్యోగులను తొలగించడం చేస్తున్నాయి. కానీ.. రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు మాత్రం ఈ బర్డెన్‌ తాము మోయలేమంటూ రాజీనామా బాట పడుతున్నారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆగస్టు నెల వరకు రాష్ట్రంలో 1,260 మంది రాజీనామా చేశారు.

Also Read: కేసీఆర్ కు అసమ్మతి జ్వాల తగలనుందా?

2018 అక్టోబర్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం 9,355 కార్యదర్శుల పోస్టులకు రిక్రూట్‌మెంట్‌ నిర్వహించింది. జిల్లా స్థాయిలో మెరిట్‌ సాధించిన వారికి 2019 ఏప్రిల్‌లో హడావుడిగా నియామక పత్రాలు అందించారు. అప్పట్లో కార్యదర్శి కొలువు అంటే పెద్ద స్థాయిలో ఊహించుకొని డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్‌, ఎంటెక్‌, ఎంఫిల్‌, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా ఎగ్జామ్‌ రాశారు. రాకరాక సర్కార్‌‌ ఉద్యోగం రావడంతో ఎంతగానో సంబరపడ్డారు. కానీ.. ఆ సంబరం పట్టుమని పది రోజులు కూడా ఉండడం లేదు.

అన్ని శాఖల ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు వస్తుండగా.. వీరికి మూడు నెలలకో, నాలుగు నెలలకో ఒకసారి ఇస్తున్నారు. దీంతో కుటుంబపోషణ భారమవుతోంది. దీనికితోడు విపరీతమైన పనిఒత్తిడి. మొన్నటి వరకు గ్రామాల్లో ఈజీఎస్‌ పనులు చూస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను కూడా తొలగించడంతోపాటు ఆ పనిని కూడా సెక్రటరీలకు అప్పజెప్పారు. ఇప్పుడు హరితహారం సీజన్‌ నడుస్తోంది. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో 40 వేల మొక్కలు నాటాలని కార్యదర్శులకే టార్గెట్‌ పెట్టారు. పల్లె ప్రకృతి వనాలు, తదితర పర్యవేక్షణ బాధ్యతలు మోపారు. దీంతో కొలువు కష్టంగా భావిస్తున్నారు. ఇవన్ని మోస్తున్నా తమకు ఇస్తామన్న రూ.15 వేల జీతం కూడా సరిగా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు.

వీటన్నింటికి తోడు గ్రామాల్లో సర్పంచులు, కార్యదర్శుల మధ్య పొసగడం లేదు. ఏదో ఒక విషయంలో విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అటు మండల స్థాయి అధికారులూ టార్గెట్‌ అంటూ టార్చర్‌‌ పెడుతున్నారు. మీటింగ్‌ల పేరిట ఆఫీసులకు పిలిపించుకుంటూ క్లాస్‌ ఇస్తున్నారు. పొద్దంతా విలేజ్‌లో పనులతో అలసిపోతుంటే.. సాయంత్రం అయిందంటే ఆఫీసుల్లో సమీక్షల పేరిట వేధిస్తున్నారు.

Also Read: తెలంగాణ చారిత్రక సౌధం.. కరిగిపోతోందా?

మరోవైపు పంచాయతీల్లో నిధుల్లేక కార్యదర్శులపై భారం పడుతోంది. పల్లెప్రగతిలో భాగంగా ప్రతినెలా ప్రభుత్వం రూ.339 కోట్లు రిలీజ్‌ చేస్తున్నా.. ఒక్కో గ్రామానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకే వస్తున్నాయి. పెద్ద పంచాయతీల పరిస్థితి కొంత వరకు మెరుగ్గా ఉన్నా.. చిన్న పంచాయతీల్లో అధ్వానంగా ఉంది. పాలకవర్గ మీటింగ్‌లు.. ఆఫీసర్ల పర్యటనలు వీటన్నింటి బాధ్యత కూడా కార్యదర్శులదే. వచ్చిన నిధులు ఎటూ సరిపోవడం లేదని.. బిల్లులు పెడుతున్నా నిధులు ఇవ్వడం లేదని ఓ కార్యదర్శి వాపోయాడు.

వీటన్నింటినీ భరించలేని కార్యదర్శులు వందల సంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటివరకు నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 139 మంది, ఆదిలాబాద్‌ జిల్లాలో 62, ఉమ్మడి నల్గొండలో 142 మంది, ఉమ్మడి మెదక్‌లో 212 మంది కొలువులకు దూరమయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లాలోనూ 163 మంది, మహబూబ్‌నగర్‌‌ జిల్లాలో 267, రంగారెడ్డి జిల్లాలో 61 మంది, వరంగల్‌ జిల్లాలో 214 మంది తప్పుకున్నారు. చాలాసార్లు జిల్లాల వారీగా ఆందోళనలు చేశారు. కలెక్టరేట్లను ముట్టడించారు. కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలనూ తీసుకెళ్లారు. కానీ.. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్వచ్ఛందంగా కార్యదర్శి పోస్టులకు రాజీనామాలు చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular