ఆకలి తీరిన తర్వాత మనిషి ఆలోచించేది అందలం గురించే! దేశంలో కార్పొరేట్ దిగ్గజంగా పేరుగాంచిన గౌతమ్ అదానీ ఆస్తులు ఏ రేంజ్ లో పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. ఆస్తుల విషయంలో అంబానీతో పోటీ పడుతున్న ఆయన.. చట్టసభల్లోకి కూడా అడుగు పెట్టబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అదికూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ కాబోతున్నారని ప్రచారం సాగుతోంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ చర్చ విస్తృతం కావడం గమనార్హం.
తన పేరు పక్కన ఎంపీ అని రాసుకోవాలని గౌతమ్ అదానీ ఆశపడుతున్నారట. ఇదే నిజమైతే.. కేంద్రంలోని బీజేపీకి ఇదేం పెద్ద విషయం కాదు. కానీ.. ఇప్పటికే బీజేపీ సర్కారు కార్పొరేట్ల కోసమే పనిచేస్తోందంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. అందులోనూ అంబానీ, అదానీ కోసమేనని విమర్శకులు దుమ్మెత్తి పోస్తున్నారు. కాబట్టి.. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నేరుగా రాజ్యసభకు అదానీని పంపే ఛాన్స్ లేకపోవచ్చు.
కానీ.. ఖచ్చితంగా అదానీ ఎంపీ కావాలని కోరుకుంటే.. మిత్రపక్షాల ద్వారానే పని పూర్తి చేయించే అవకాశం ఉంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు వైసీపీ కనిపిస్తోందని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీతో వైసీపీ సన్నిహితంగానే మెలుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అవన్నీ వైసీపీకి దక్కనున్నాయి. అందులో ఒకటి అదానీకి కేటాయించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
జగన్ ఢిల్లీ పర్యటనలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి, ఇందులో వాస్తవం ఎంత అన్నది తెలియదుగానీ.. బీజేపీ సిఫార్సు చేస్తే మాత్రం వైసీపీ కాదనే ప్రసక్తి లేదన్నది విశ్లేషకుల మాట. మరి, అదానీ నిజంగానే ఎంపీ కావాలనుకుంటున్నారా? ఏం జరగనుంది? అన్నదానిపై మరి కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.