
ఇటీవల శ్రీకాళహస్తి పట్టణంలో ఆ ప్రాంతపు ఎమ్మెల్యే (వైసీపీ) బియ్యపు మధుసూదన్ రెడ్డి, ట్రాక్టర్లలో పెద్ద పెద్ద ఫోటోలు, హోర్డింగ్ లు పెట్టి కరోనా బాధితులకు బియ్యం పంచిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఆ శ్రీకాళహస్తి పట్టణం మొత్తం రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లింది. ఇతర గ్రామాల నుండి ఒక్కరు కూడా శ్రీకాళహస్తి కి రాకూడదు, పట్టణం నుండి ఎవరు బయటకు వెళ్లకూడదనే రూల్ ఖచ్చితంగా అమలుచేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి వెలుపలికి రాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఇళ్లలో కూడా భౌతికదూరం పాటించాలని సూచించారు.
హస్తిలో తాజాగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా మొత్తంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73కు చేరింది. అందులో అత్యధిక కేసులు శ్రీకాళహస్తిలో నమోదయ్యాయి. నిత్యావసర సరుకులు అవసరమైన వారికి వలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేయిస్తున్నారు. ఈక్రమంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ నారాయణ భరత్ గుప్త మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నుంచి ఉద్యోగుల రాకపోకలను నిషేధించామన్నారు. మే 3 వరకు ఎలాంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. కేవలం 35వార్డులు ఉన్న పట్టణంలో ఇన్ని కేసులు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. 14రోజులపాటు కొత్త కేసులు నమోదు కాకుంటే ఆరెంజ్ జోన్ గా ప్రకటిస్తామని చెప్పారు. కోవిడ్–19 ప్రత్యేకాధికారిగా సునీల్కుమార్రెడ్డిని ప్రభు త్వం నియమించిందని తెలిపారు.
శ్రీకాళహస్తి పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో గురు వారం రాత్రి అధికారులు వాహనాల తో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రజల ను అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తితో పాటు తిరుపతి, నగరి, పలమనేరు, రేణిగుంట, ఏర్పేడు, చంద్రగిరి, నిండ్ర, వడమాలపేట, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, పుత్తూరు, బీఎన్ కండ్రిగ మండలాల్లో కొత్త కేసులు నమోదు కావడంతో వాటిని కూడా రెడ్ జోన్లుగా ప్రకటించామని కలెక్టర్ వెల్లడించారు.