Homeజాతీయ వార్తలుచత్తీస్ ఘడ్: ‘హిడ్మా’ ప్లాన్లేంటి? ఎలా చంపేస్తాడు?

చత్తీస్ ఘడ్: ‘హిడ్మా’ ప్లాన్లేంటి? ఎలా చంపేస్తాడు?

Maoists
2010 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను దాడులను పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. పక్కా వేసవి సీజన్‌ మొదలయ్యాకే మావోయిస్టులు భద్రతా దళాలపై దాడులు చేశారు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే వీరి టార్గెట్లు. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో జవాన్లు, నాయకులు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు కమాండర్‌‌ మాడ్వి హిడ్మా అలియాస్‌ సంతోష్‌ వ్యూహాలతోనే ఇవి అత్యధికంగా జరిగాయనేది వాస్తవం. తాజాగా.. జరిగిన దాడి కూడా మావోయిస్టులు పక్కా ప్రణాళికతో చేసినట్లు తెలుస్తోంది.

కొన్నేళ్లుగా బీజాపూర్‌‌–సుక్మా ప్రాంతంలో మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు నాయకుడు హిడ్మా కోసం సీఆర్పీఎఫ్‌, కోబ్రా, పోలీసు దళాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. దీన్ని అదునుగా చేసుకొని దళాలను తమ ఉచ్చులోకి లాగినట్లు తెలుస్తోంది. బీజాపూర్‌‌–సుక్మా సమీపంలోని అడవుల్లో హిడ్మా సహా భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు దళాలకు సమాచారం దొరికింది. అయితే.. ఈ సమాచారం కాస్త మావోయిస్టులే కావాలని పోలీసులకు చేరవేసేలా చేశారు. దీంతో వందల కొద్దీ సిబ్బందితో బలగాలు గాలింపు చేపట్టాయి. వారికి ఎవరూ దొరక్కపోవడంతో తిరుగుముఖం పట్టిన సమయంలోనే హఠాత్తుగా ఈ దాడిచేశారు.

ఇదిలా ఉండగా.. బలగాలు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌‌ను నిర్లక్ష్యం చేశాయనేది నిపుణుల అభిప్రాయం. కూంబింగ్‌ చేసే క్రమంలో సాధారణంగా ఎత్తయిన ప్రదేశాల్లో దళాలు నడవాలి. లోయల్లో నడిస్తే కొండల పైనుంచి మావోయిస్టులు తేలిగ్గా కాల్పులు జరిపే ప్రమాదం ఉంటుంది. తాజా.. దాడిలోనూ భద్రతా దళాలు రెండు కొండల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఎండాకాలం కావడంతో చెట్ల ఆకులు రాలిపోయి ఉంటాయి. దీంతో కొండ దిగువన దళాల కదలికలు స్పష్టంగా మావోలకు కనిపిస్తుంటాయి. అందుకే.. మావోలు భారీ దాడులకు ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలోనే ఎంచుకుంటారు. తాజాగా.. జరిగిన ఎన్‌కౌంటర్‌‌లోనూ ఈ విషయం స్పష్టమైంది.

అడవుల్లో ఉండే పరిస్థితి లేకపోవడంతో మావోలు గ్రామాల్లో నక్కి ఉండే అవకాశాలు ఎక్కువ. అలాంటి సమయంలో గ్రామాల్లోకి వెళ్లడం మరింత ప్రమాదకరం. మానవ కవచాలను అడ్డం పెట్టుకొని కాల్పులకు తెగబడితే భద్రతా దళాల పని మరింత కష్టం అవుతుంది. గాలింపులో భాగంగా దళాలు జిర్గాన్‌, టేకులగూడెం గ్రామాలను దాటి వెళ్లాయి. ఆ సమయంలో గ్రామాలు పూర్తి నిర్మానుష్యంగా ఉన్నాయి. అప్పుడు కూడా తాము ఉచ్చులో చిక్కుకున్న విషయాన్ని గుర్తించలేదని గాయపడిన ఓ జవాన్‌ చెప్పారు. తిరుగు ప్రయాణంలో జరిగిన దాడి సమయంలో భద్రతా దళాలు సమీపంలోని టేకులగూడెం గ్రామంలోకి ప్రవేశించాయి.

సుక్మా ప్రాంతంలో మావోయిస్టుల ‘పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ బెటాలియన్‌ నంబర్‌‌ 1’ ఈ మారణకాండలో పాల్గొంది. ఈ దళం హిడ్మా నేతృత్వంలో పనిచేస్తుంటుంది. ఇందులోని సభ్యులు అత్యాధునిక ఆటోమెటిక్‌ ఆయుధాలను కలిగి ఉంటారు. దళాలపై దాడులు చేశాక.. అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లను ఈ బెటాలియన్‌ ఎక్కువగా వాడుతుంటుంది. వీరు పూర్తిగా యూనిఫామ్‌లో ఉంటారని సమాచారం. హిడ్మా నేతృత్వంలో జరిగే దాడుల్లో భద్రతా దళాలకు జరిగే నష్టంతో పోలిస్తే మావోయిస్టుల వైపు 10శాతం కంటే తక్కువే ప్రాణనష్టం ఉంటుందనేది పేరుంది. అందుకే గతంలో సుక్మా సమీపంలో జరిగిన దాడుల్లోనూ భద్రతా దళాలు భారీగా ప్రాణనష్టాన్ని చవిచూశాయి. అందుకే.. అతను అత్యంత వేగంగా మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా స్థానం దక్కించుకున్నాడు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉంటారు. ఆకనీ.. సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్లిన ఫస్ట్‌ పర్సన్‌ హిడ్మా. అయితే.. వీరప్పన్‌ కర్ణాటక–తమిళనాడు అడవుల్లో పాతుకుపోవడానికి కలిసొచ్చిన పరిస్థితులే ఇప్పుడు మావోయిస్టు నేత హిడ్మాకు కలిసొస్తున్నట్లు భద్రతా రంగ నిపుణులు చెబుతున్నారు. హిడ్మా స్థానిక ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. దీంతో అతనికి గ్రామస్తుల మద్దతు లభిస్తోంది. దీంతో బలమైన ఇంటలీజెన్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉన్న ప్రాంతానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో బలగాలు ఉన్నాయో.. హిడ్మాకు ఇట్టే తెలిసిపోతుంటుంది. అంతేకాదు.. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాకు తేలిగ్గా వెళ్లే జంక్షన్‌లో ఉండడం కూడా హిడ్మాకు కలిసొచ్చే అంశం. అంతేకాదు.. సుక్మా చుట్టుపక్కల అడవుల్లోని మార్గాలపై హిడ్మాకు బలమైన పట్టుంది. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన హిడ్మా ఇంగ్లిష్‌ మాత్రం చక్కగా మాట్లాడగలడు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular