విజయవాడ నగరంలో పాజిటివ్ కేసులు ఎలా పెరుగుతున్నాయో అర్థంగాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా నమోదైన కేసులను పరిశీలిస్తే కరోనా వైరస్ ఎలా విస్తరించిందనే విషయం తెలియడంలేదు. ఇప్పటికే 25 కు పైగా కేసులు నగరంలో నమోదయ్యాయి. వీటికి తోడు శనివారం ఒక్క రోజే మరో 16 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తిలో మూడవ దశకు చేరుకున్నామా అనే సందేహం కలుగుతోంది. బయటి నుంచి వచ్చిన వారి నుంచి కాకుండా నగరంలోనే సామాజిక సంక్రమణ స్థాయికి చేరుకున్నామా అనే అంశంలో గందరగోళం నెలకొంది.
ఇటీవల మాచవరంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె ఎలా సోకిందనే అంశంపై ఇంకాస్పష్టత రాలేదు. అధికారులు పలుమార్లు ఆరా తీస్తే కేవలం ఒకసారి జనరల్ స్టోర్కు వెళ్లానని, మరోసారి కూరగాయలకు తప్ప బయటకు వెళ్లలేదని ఆ మహిళ అధికారులకు సమాధానం ఇచ్చింది. దీంతో అవాక్కవడం అధికారుల వంతయ్యింది.
ఇదే మహిళ కుటుంబ సభ్యులకు తాజాగా ఆరుగురికి కరోనా పాజిటివ్ రావడం చర్చానీయాంశమైంది. పొంతన లేని కేసులు రావడతో నగరంలో కరోనా విస్తరణ మూడో దశలో ఉందా అన్న సందేహం వ్యక్తం అవుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆదివారం బంద్ పాటించాలని ఆదేశించారు. నగరంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.