
కరోనా కట్టడికి ముందుండి పోరాడుతున్న పోలీసులపై కరోనా తన పంజా విసురుతోంది. ఇటీవల కరోనా సోకి పోలీసు కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి మృతి చెందారు. అలాగే బాలాపూర్ లో ఏఎస్ఐ గా పని చేస్తున్న సుధీర్ కృష్ణ కు కరోనా వైరస్ సోకింది. తాజాగా రాజధానిలో మరో నలుగురు పోలీసులు కరోనా పాజిటివ్ లుగా తేలారు. ప్రస్తుతం వీరు గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ లోని కాచీగూడ పోలీస్స్టేషన్ లో పనిచేస్తున్న ఓ ఎస్ఐ, వివిధ స్టేషన్లకు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు కరోనా పాజిటివ్ లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎస్ఐ కుంటుంబ సభ్యులను క్వారంటైన్ కు తరలించారు. అయితే దీన్ని పోలీసు అధికారులు ధృవీకరించాల్సి ఉన్నది. ఎస్ఐకి కరోనా పాజిటివ్ రావడంతో కాచీగూడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నవారందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
అలాగే కుల్సుంపురా పోలీస్ స్టేషన్ కు చెందిన దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ కరోనా సోకి మరణించిన విషయం తెలిసిందే.. దీంతో ఈ స్టేషన్ లో పనిచేస్తున్నవారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారికి నెగెటివ్ వచ్చింది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఈ రోజు మధ్యాహ్నం కుల్సుంపుర స్టేషన్ ను సందర్శించారు. కరోనాతో మరణించిన దయాకర్ రెడ్డికి ఆయన నివాళులర్పించారు.