Homeఆంధ్రప్రదేశ్‌నెల్లూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

నెల్లూరు వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

Nellore YCP
ఎంతసేపూ ప్రజా సంక్షేమ పథకాలపైనే దృష్టి సారించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదనే అపవాదు వినిపిస్తోంది. అందుకే.. పలుచోట్ల సొంత పార్టీలోనే రాజకీయ విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్న గన్నవరం వైసీపీలో విభేదాలు రచ్చకెక్కగా.. ఇప్పుడు నెల్లూరు జిల్లా వేదికగా వెలుగులోకి వచ్చాయి.

Also Read: వైఎస్‌ జగన్మోహనపురంపై ప్రతిపక్షాల సెటైర్లు

నెల్లూరు జిల్లా వైసీపీలో ఆనం వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా ఆనం, అనిల్ వర్గాల మధ్య గొడవ మొదలైంది. వివేకానందరెడ్డి ఫ్లెక్సీలు తొలిగించారంటూ ఆయన తనయుడు రంగమయూర్ రెడ్డి అనిల్ వర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బెట్టింగ్ రాయుళ్ల ఫ్లెక్సీలు వారాల తరబడి కనిపిస్తున్నాయని.. ఆనం వివేకా ఏం పాపం చేశారంటూ పరోక్షంగా మంత్రి అనిల్‌ను టార్గెట్ చేశారు. వివేకా పెట్టిన రాజకీయ భిక్షతో పైకెదిగారంటూ అనిల్ పేరు ప్రస్తావించారు.

మరోవైపు వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వివేకా సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా నెల్లూరు సిటీ పాలిటిక్స్ పేరు తెరపైకి తేవడంతో వివాదం మొదలైంది. ఇకపై నెల్లూరు నుంచే తన రాజకీయాలుంటాయని, పరోక్షంగా సిటీ ఎమ్మెల్యే, మంత్రి అనిల్ వర్గానికి హెచ్చరికలు జారీ చేశారు ఆయన.

Also Read: నివర్‌‌ బాధిత రైతుల కోసం పవన్‌ ప్రత్యక్ష పోరాటం

2019 ఎన్నికల తర్వాత సీనియార్టీ పరంగా ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి వరిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే నెల్లూరు జిల్లా నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్‌‌కు మంత్రి పదవులు దక్కాయి. వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా చేసి, ఓ దశలో ముఖ్యమంత్రి అవుతారని జోరుగా ప్రచారం జరిగిన ఆనం రామనారాయణ రెడ్డిని, ఎందుకో తెలియదు కానీ జగన్ పక్కన పెట్టారు. తనకు మంత్రి పదవి రాకపోవడం ఓవైపు, తమ కుటుంబం చలవతో రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ చకచకా ఎదగడం మరోవైపు.. జిల్లా రాజకీయాల్లో ఆనం పెత్తనం చేజారిపోతుందనే భావనతో రామనారాయణ రగిలిపోయారు.

ఇక వివేకానందరెడ్డి ఇద్దరు కొడుకులు కూడా రాజకీయాల్లో పెద్దగా రాణించడం లేదు. నెల్లూరు రాజకీయాల్లో వారికి పట్టంటూ లేదు. రామనారాయణ రెడ్డి నెల్లూరుకి దూరంగా వెంకటగిరి ఎమ్మెల్యేగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో నెల్లూరు సిటీపై అనిల్ పూర్తిగా పట్టు సాధించారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా సిటీలో తమ మాట చెల్లించుకోవాలనే ఉద్దేశంతో ఆనం వర్గం సమయం కోసం ఎదురు చూస్తోంది. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచనతో ఉన్నారు రామనారాయణ రెడ్డి. అందుకే.. తాజాగా ఈ ఫ్లెక్సీల వివాదం రచ్చకెక్కినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular