Homeజాతీయ వార్తలుజై కేటీఆర్‌‌.. ఆయనే మా సీఎం

జై కేటీఆర్‌‌.. ఆయనే మా సీఎం


భూమి కోసం.. భుక్తి కోసం.. పేద ప్రజల విముక్తి కోసమంటూ ఎర్రజెండాలు పట్టిన కామ్రేడ్స్‌ ఇప్పుడు కేటీఆర్‌‌ పాట ఎందుకు పాడుతున్నట్లు..? ఆయనపై ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చినట్లు..? ప్రజా ఉద్యమాలే ఎజెండాగా పోరాటాలు సాగించే లెఫ్ట్‌ పార్టీలు ఇప్పుడు కేటీఆర్‌‌ సారే సీఎంగా రైట్‌ అని ఎందుకు అంటున్నాయి..? కేటీఆర్‌‌ సీఎం అయితే వీరికి వచ్చే ప్రయోజనం ఏంటి..? మొదటి నుంచి ప్రభుత్వంపై దూకుడుగా ఉండి.. ఇప్పుడు లెటర్ల వరకే ఎందుకు పరిమితం అయ్యారు..? లెటర్ల ద్వారా సమస్యలు పరిష్కారం కావని వారికి తెలియదా..? పోరాటాలను ఎందుకు పక్కనపెట్టినట్లు..? ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా ఉండి ఏం చేద్దామని..? తెలంగాణలో సుత్తి.. కొడవలిని గులాబీతో జతచేద్దామనా..?

Also Read: బాబు అరాచకానికి నేటితో 20ఏళ్లు..!

సీపీఐ.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా.. అదొక జాతీయ పార్టీ. ఎందరో వృద్ధండులు.. మరెందరో అనుభవశాలీలు పార్టీలో ఉన్నారు. దశాబ్దాల చరిత్ర. కానీ.. ఇప్పుడు ఉనికి కోల్పోయి పరువు దిగజార్చుకొని తప్పటడుగులు వేస్తోంది. ప్రజాపోరాటాల్లో ఎప్పుడూ ముందుండే వీరు ఇప్పుడు వెనకడుగు వేశారు. సమస్యలపై ప్రజల్లోకి వచ్చి పోరాడే వీరు ఇప్పుడు లెటర్ల ఉద్యమం చేస్తున్నారు. కరోనా టైంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు.. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పేందుకు ఉద్యమించకపోగా కేవలం లెటర్లు రాసి చేతులు దులుపుకున్నారు. దీనిపై ఇప్పటికే ఎన్నో రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రభుత్వంతో వీరేమైనా జత కడుతున్నారా అని విమర్శలూ వస్తున్నాయి.

ఎన్నికల్లో కేసీఆర్‌‌ను గద్దె దించడమే లక్ష్యంగా.. టీఆర్‌‌ఎస్‌ పార్టీని ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకొని ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ మహాకూటమి కూర్పునకు ప్రధాన కారణం కూడా సీపీఐనే. మళ్లీ ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది కూడా సీపీఐనే. దీనిపైనా ఎన్నో విమర్శలు మూటగట్టుకున్నారు. మొన్నటి హుజూర్‌‌నగర్‌‌ ఉప ఎన్నికలోనూ గులాబీ పార్టీతో జతకట్టి తెలంగాణ సమాజానికి పెద్ద షాక్‌ ఇచ్చారు. ప్రజాగ్రహంతో తమ వైఖరిని మార్చుకొని ఎట్టకేలకు మద్దతును ఉపసంహరించుకుని చారిత్రక తప్పిదం నుంచి తప్పించుకున్నామని పార్టీ భావించింది. కానీ.. ఆ మచ్చ పార్టీని ఇంకా వీడడం లేదు.

Also Read: ‘కలెక్టర్ల’కు మంగళం పాడుతున్న కేసీఆర్

అప్పటి నుంచి చల్లబడ్డ పార్టీ.. ఇప్పుడు మెల్లమెల్లగా కేటీఆర్‌‌ పేరు జపం చేస్తోంది. ఎందుకంటే.. కేసీఆర్‌‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్‌‌ అని. కేబినెట్‌ మంత్రులే దీనిపై తమదైన లీకులు ఇస్తూ.. ప్రచారాలు కల్పిస్తున్నా ఇతర పార్టీల నుంచి పెద్దగా ఏ కామెంట్స్‌ లేవు. కానీ.. సీపీఐ మాత్రం శుభపరిణామం అన్నట్లు వెల్‌కం చెబుతోంది. ఏకంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం కేటీఆర్‌‌ సీఎం కావడాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడాలంటే యువకుడైన కేటీఆర్‌‌కు బాధ్యతలు అప్పగిస్తే మంచిదంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు కేటీఆర్‌‌ పార్టీ వర్కింగ్‌ అయినప్పటికీ ప్రభుత్వానికి కూడా వర్కింగ్‌ సీఎం అన్నట్లు భావించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రజా సమస్యలపై కేటీఆర్‌కు లేఖ రాస్తా అని ప్రకటించారు. వీరి మాటలు విన్న రాజకీయ విశ్లేషకులు కామ్రేడ్స్‌ రూటు మార్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు. వీరి పంతం చూస్తుంటే కేటీఆర్‌‌ని సీఎం చేసే దాకా వదిలేలా లేరంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు కూడా ఇబ్బడిముబ్బడిగా పడుతూనే ఉన్నాయి. లెఫ్ట్‌ పార్టీలు ప్రధాన పార్టీలకు తోక పార్టీలా మారుతున్నాయని ట్రోల్‌ అవుతూనే ఉన్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular