KCR Vs Jagan: తెలుగు రాష్ట్రాల్లో ఏది నమ్మకమైన ప్రభుత్వ అని అడిగితే.. తెలంగాణ సర్కారు వైపే అన్ని వేళ్ళు చూపుతాయి. కెసిఆర్ ఎలాంటి రాజకీయాలు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకాన్ని పోగొట్టుకునేలా మాత్రం వ్యవహరించరు.తెలంగాణలోని కోకాపేట భూములు వేలమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ ఒక్కో ఎకరానికి 100 కోట్ల రూపాయలు చెల్లించేందుకు రియల్టర్లు ముందుకు వచ్చారు. అదే అమరావతి భూములు వేలం వేస్తే ఒక్కరూ ముందుకు రాలేదు. కనీసం ప్రకటనల ఖర్చు కూడా రాలేదు.
హైదరాబాద్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. ప్రపంచస్థాయి నగరంగా మారుతోంది. అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలు వెల్లువలా వస్తున్నాయి. ఈ డిమాండ్ పెద్ద ఆశ్చర్యం కాదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నా.. తెలంగాణ సర్కార్ ను అభినందించక మానలేము.
ఏపీలో భూములు వేలం వేస్తామంటే ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఎకరాల్లో కాదు గజాలు లెక్కన కొనడానికి కూడా ఎవరు ఆసక్తి చూపడం లేదు. మంగళగిరి నవ్వులూరు వద్ద ఉన్న 285 ఎకరాల భూమిని విక్రయించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. మొత్తం 1327 ప్లాట్లను అభివృద్ధి చేశారు. చదరపు గజం రూ.17,800గా నిర్ణయించారు. ప్లాట్లను ఈ ఆక్షన్ ద్వారా విక్రయించడానికి సిద్ధపడ్డారు. దాదాపు 1000కోట్ల ఆదాయం వస్తుందని ఆశించారు. కానీ ఒకరిద్దరూ తప్ప ఆ ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. ఇలా చేసిన వారు సైతం వెనక్కి తగ్గారు.
వాస్తవానికి అమరావతిలో విక్రయానికి సిద్ధపడిన ప్లాట్లకు చేరువలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం,అకాడమీ, ఎయిమ్స్ ఆసుపత్రి, మంగళగిరి రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. అయినా సరే వైసీపీ ప్రభుత్వం పై నమ్మకం లేక ఎవరూ ముందుకు రాలేదు. అదే కోకాపేట భూములు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో తెలంగాణ సర్కార్ పరపతి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏపీతో పోల్చుకుంటే గణనీయమైన ముందంజలో ఉంది. ఇది జగన్ సర్కార్ వైఫల్యాన్ని తెలియజేస్తోంది.