హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అయితే.. కేసీఆర్ లో మరీ ఇంత కదలిక తెస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దీన్ని బట్టి కేసీఆర్ ఎంత టెన్షన్ పడుతున్నారో స్పష్టమవుతోందని అంటున్నారు పరిశీలకులు. హుజూరాబాద్ కోసమే దళిత బంధు పథకాన్ని తెచ్చామని స్వయంగా ప్రకటించుకున్నారు కేసీఆర్. ఆ తర్వాత ఆ నియోజకవర్గానికి చెందిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కన్ఫామ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ పదవి కూడా అక్కడి నేతకే ఇచ్చేశారు.
అయితే.. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇలాంటి చర్యలు చేపట్టడం గమనార్హం. గతంలో ఇచ్చిన హామీలను హుజూరాబాద్ ఎన్నిక సందర్భంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని హెయిర్ సెలూన్లు, లాండ్రి షాపులకు సర్కారు కీలక సూచనలు చేసింది. ఉచిత విద్యుత్ సౌకర్యం కోసం దరఖాస్తు చేసుకోవాలని వీరికి సూచించడం గమనార్హం. అంతేకాదు.. సాగర్లో పర్యటించిన కేసీఆర్.. అక్కడ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిధులు ప్రకటించారు. దీంతో.. ఇదంతా హుజూరాబాద్ గండం గట్టెక్కేందుకు చేస్తున్న ప్రయత్నంగానే అందరూ చెప్పుకుంటున్నారు.
కేసీఆర్ హామీలు ఇవ్వడం తప్ప.. వాటిని నెరవేర్చడం లేదని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. చాలా మంది జనాల్లోనూ ఇదే అభిప్రాయం ఉందని అంటున్నారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలతోపాటు చాలా చూపిస్తున్నారు. ఇప్పుడు దళిత బంధును ప్రకటించిన ముఖ్యమంత్రి.. దాన్ని కూడా హుజూరాబాద్ కే పరిమితం చేయడంపై విమర్శలు వచ్చాయి.
దీంతో.. తాను ఇచ్చిన హామీని అమలు చేస్తానని చెప్పడానికే.. ఇటు జీహెచ్ఎంసీ, సాగర్ లో ఎప్పుడో ఇచ్చిన హామీలకు.. ఇప్పుడు హడావిడిగా నిధులు ప్రకటించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాగార్జున సాగర్ అభివృద్ధికి రూ.150 కోట్లు ప్రకటించారు. మౌలిక వసతుల అభివృద్ధిని త్వరగా పూర్తిచేస్తామని చెప్పుకొచ్చారు. ఇక, హుజూరాబాద్ లో జనాలు అడిగిందీ.. అడగనిదీ.. అన్నీ ప్రకటిస్తున్నారు. దళిత బంధు మొదలు.. కొత్త పించన్లు, రేషన్ కార్డులు అంటూ పథకాలన్నీ అక్కడ పరుగులు పెడుతున్నాయి.
ఇదంతా హుజూరాబాద్ ఎన్నిక ప్రభావమేనని అంటున్నారు. ఒకవేళ హుజూరాబాద్ ఉప ఎన్నిక లేకపోతే.. అసలు కేసీఆర్ ఈ హామీల గురించి, పనుల గురించి పట్టించుకునేవారా? అనే చర్చ కూడా సాగుతోంది. దీన్నిబట్టి.. హుజూరాబాద్ ఎన్నికపై కేసీఆర్ ఏ స్థాయిలో టెన్షన్ పడుతున్నారో అర్థమవుతోందని అంటున్నారు విశ్లేషకులు. మరి, ఇంత చేసినా.. విజయం దక్కుతుందా? లేదా? జనం ఎవరిని నమ్ముతారు? అన్నది చూడాలి.