Junior NTR- Chandrababu: వచ్చే ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు అత్యవసరం. ఆ పార్టీకి జీవన్మరణ సమస్య. అందుకే చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఏడు పదుల వయసును లెక్క చేయకుండా ప్రజల్లో తిరుగుతున్నారు. వారితో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు కుదుర్చుకునేందుకు ఉబలాట పడుతున్నారు. మరోవైపు గతంలో జరిగిన తప్పిదాలకు తావివ్వకూడదని డిసైడ్ అయ్యారు. అన్నింటికంటే మించి ఈసారి నందమూరి కుటుంబసభ్యులకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నందమూరి కుటుంబానికి చెందిన కొత్త ముఖాలను తెచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలక్రిష్ణ టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అక్కడ నుంచే పోటీకి సిద్ధపడుతున్నారు.

ప్రస్తుతానికి నందమూరి కుటుంబమంతా చంద్రబాబుతోనే ఉంది. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప అందరూ సన్నిహితంగానే ఉంటున్నారు. చివరకు హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్, కుమార్తె సుహాసిని మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. అటు బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబం సైతం దగ్గరవుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఇలా దాదాపు నందమూరి కుటుంబాన్నంతటిని ఒకేతాటిపైకి తెచ్చి వచ్చే ఎన్నికల్లో గట్టిగానే తలపడాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. తద్వారా నందమూరి కుటుంబాన్ని తాను అణగదొక్కానన్న అపవాదు నుంచి బయటపడేందుకు చంద్రబాబు డిసైడయ్యారు.
ఎన్టీఆర్ పెద్దకుమారుడి కుమారుడు చైతన్య కృష్ణను గుడివాడ నుంచి బరిలో దించాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అక్కడ కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు సార్లు టీడీపీ నుంచి.. రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అటు ఎన్టీఆర్ అంటే తనకు దైవంతో సమానమని.. తనకు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ లైఫ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. తన వెనుక జూనియర్ ఉన్నారని అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నందమూరి కుటుంబసభ్యలతో నానికి చెక్ చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు చైతన్య కృష్ణ కూడా రెడీ అవుతున్నారు. ఇటీవలే సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. మరో వారసుడు తారకరత్న కూడా పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. చంద్రబాబు ఆదేశిస్తే ఎక్కడ నుంచైనా పోటీచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

నందమూరి కుటుంబ సభ్యులను ఏకతాటిపైకి తేవడానికి మరో రీజన్ ఉంది. చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ పక్కలో బల్లెంలా మారారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత జూనియర్ ను పార్టీలోకి తేవాలన్న డిమాండ్ వచ్చింది. ఒకరిద్దరు పెద్ద నాయకులు కూడా ఇదే మాట చెప్పారు. అటు చంద్రబాబు సభల్లో కూడా శ్రేణుల నుంచి అదే మాట వినిపించింది. అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సీటీ పేరు మార్పు, నారా భువనేశ్వరిపై వైసీపీ నేతల కామెంట్స్ పై జూనియర్ పెద్దగా రియాక్ట్ కాలేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో కూడా జూనియర్ పై ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. అదే సమయంలో మిగతా నందమూరి కుటుంబమంతా ఇష్యూలపై ఎక్కువగా రియాక్టయ్యారు. దీనిని క్యాష్ చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. జూనియర్ ను సైడ్ చేసి… నందమూరి వారసులను ఎన్నికల్లో పోటీ పెట్టాలని డిసైడ్ అయ్యారు. అది కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారిపైనే ప్రయోగించాలని చూస్తున్నారు. దాంతో వారిని చెక్ చెప్పడమే కాదు.. జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ ను కూడా ముగించాలన్న వ్యూహంలో చంద్రబాబు ఉన్నారు.