Chandrababu: సీట్ల సర్దుబాటు విషయంలో జనసైనికులను పవన్ కంట్రోల్ లో పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీలో అది కుదిరే పనిగా కనిపించడం లేదు. ఐదు సంవత్సరాలు పాటు ఇన్చార్జిలుగా ఉంటూ.. ఇప్పుడు టిక్కెట్ వేరే వారికి ఇస్తే వారు ఊరుకునే పరిస్థితిలో మాత్రం లేరు. ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. ఎక్కడికక్కడే ప్రశ్నలు, నిలదీతలు బయటపడుతున్నాయి. అసంతృప్తులు రెండు రోజులపాటు ఉంటాయని.. అది కామన్ అని చంద్రబాబు అండ్ కో భావించింది కానీ.. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఎక్కడికక్కడే రియాక్ట్ అవుతున్నారు. తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీకి ఒక రకమైన ఆందోళన పరిస్థితి మాత్రం కనిపిస్తోంది.
జనసేనతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు ఉమ్మడిగా తమ అభ్యర్థులను ప్రకటించాయి. 94 చోట్ల టిడిపి, ఐదు చోట్ల జనసేన అభ్యర్థులను ప్రకటించారు. టిడిపి అభ్యర్థుల్లో చాలావరకు పాతవారే అయినా.. కొన్నిచోట్ల మాత్రం కొత్తవారిని తెరపైకి తెచ్చారు. ఇప్పటివరకు ఉన్న ఇన్చార్జిలను కాదని.. రకరకాల సమీకరణలను పరిగణలో తీసుకొని కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. అటువంటి చోట అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. కొందరైతే ఏకంగా ఉండవల్లి లోని పార్టీ కార్యాలయం వైపు దండయాత్రకు బయలుదేరారు. దీంతో పొత్తులు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన టిడిపి శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టికెట్ను జయచంద్రారెడ్డికి ఖరారు చేశారు. అక్కడ శంకర్ యాదవ్ ఇన్చార్జిగా ఉన్నారు. తనకే టికెట్ అని భావించారు. కానీ చంద్రబాబు వేరే ఆలోచన చేశారు. ఆర్థిక స్థితి మంతుడైన జయచంద్రారెడ్డికి ఖరారు చేశారు. దీంతో శంకర్ యాదవ్ అనుచరులు పెద్ద ఎత్తున చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం ఎదుట హల్చల్ చేస్తున్నారు. శంకర్ యాదవ్ కు టికెట్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. వారు ఇంటి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి రెండు పెట్రోల్ క్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఆత్మాహుతి హెచ్చరికలకు కిరోసిన్ వాడుతారు. కానీ వారు ఏకంగా పెట్రోల్ తీసుకురావడం సంచలనం రేకెత్తిస్తోంది. అయితే అయితే వారు ఆత్మహుతి చేసుకునేందుకు వచ్చారా? లేకుంటే దాడికా అన్నది తెలియాల్సి ఉంది. చంద్రబాబు కానీ..లోకేష్ కానీ వారిని సముదాయించే ప్రయత్నం చేయలేదు. కొల్లు రవీంద్ర, కొనకళ్ళ నారాయణ వంటి నేతలు సముదాయించి స్పందించారు. అయితే వారి మొర వినేందుకు కనీసం చంద్రబాబు రాకపోవడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిని సముదాయిస్తే అసంతృప్తులు అందరూ ఉండవెల్లి బాట పడతారని చంద్రబాబు భయపడుతున్నారు. మొత్తానికైతే పొత్తులు తెలుగుదేశం పార్టీలో కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి