ఆగస్టు 5వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ రెండు తెలుగు రాష్ట్రాల జలవివాదంపై అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. కానీ అప్పుడు కేసీఆర్ సమావేశానికి హాజరు కాకుండా వాయిదా వేయించారు. ఇప్పుడు అదే కేసీఆర్ పాలిట శాపం కాగా.. జగన్ పాలిట అయాచిత వరమైంది.
మొదటగా ఈనెల 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశం పేరు చెప్పి తప్పించుకున్నారు. అపెక్స్ సమావేశాన్ని వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. ఈనెల 25న కొత్త తేదిని ఖాయం చేశారు.
Also Read: తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ఎప్పటినుండో?
కానీ ఇప్పుడు కృష్ణ నది నీటిపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం అస్సలు జరగకపోయే ప్రమాదంలో పడింది. ఎందుకంటే సమావేశాన్ని నిర్వహించే కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. దీంతో ఈ సమావేశం ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు.
కృష్ణ నీటి వాటా కోసం తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలన్న ఏపి ప్రభుత్వ ప్రణాళికపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కానీ, ఇది పాత ప్రాజెక్టు అని.. తెలంగాణకు కేటాయించిన నీటిని ఉపయోగించమని చెబుతూ ఏపీ ముందుకు వెళుతోంది. ఆగస్టు 5న కేంద్రం సమావేశం నిర్వహిద్దామని కేసీఆర్ కు చెప్పినా నాడు వినలేదు. కెసిఆర్ ఎక్కువ సమయం కావాలని కోరుతూ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు 25 కి వాయిదా వేయించారు. ఇప్పుడు కేంద్ర జల్ శక్తి మంత్రి షేఖావత్ కరోనా సోకి ఆస్పత్రిలో చేరారు. సమావేశం మరింత వాయిదా పడే ప్రమాదంలో పడింది.
టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున ఈ సమావేశం వాయిదా పడడం పట్ల ఏపీ సంతోషంగా ఉంది.రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించడానికి ఎక్కువ సమయం లభిస్తుందని.. సమావేశంలోపు ప్రాజెక్టును మొదలుపెడితే ఇక ఎవ్వరూ ఆపలేరని ఏపీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినందున ఏపీ ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు సంసిద్ధమైంది. వచ్చే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీమ ఎత్తిపోతలను ఆపాలనే డిమాండ్ రానున్న నేపథ్యంలో అంతకుముందే దాన్ని పట్టాలెక్కించాలని భావిస్తోంది. ఈ గ్యాప్ లో సన్నాహక పనులతో ముందుకు సాగవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: ‘కుల’కలం.. ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్
కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనిపై ఆందోళనగా ఉంది. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లోపు ఏపీ ప్రభుత్వం సీమ ఎత్తిపోతలను పరుగులు పెట్టిస్తే ఇక ఆపడం సాధ్యం కాదని భావిస్తోంది. ఈ క్రమంలోనే అపెక్స్ భేటి వాయిదా వేయించిన కేసీఆర్ కు ఆ పరిణామం షాకింగ్ గా మారగా.. జగన్ కు మాత్రం వరమైంది.