Homeజాతీయ వార్తలుకేసీఆర్ కు అసమ్మతి జ్వాల తగలనుందా?

కేసీఆర్ కు అసమ్మతి జ్వాల తగలనుందా?


గడిచిన ఆరేళ్లుగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా నడిచింది. తెలంగాణలో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా దూసుకెళుతున్న సీఎం కేసీఆర్ కు కొద్దిరోజులుగా కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. ఇటీవలీ కాలంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి వ్యతిరేక గళాలు విన్పిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా ఎంట్రీ తర్వాత అధికార పార్టీకి ఏది కలిసి రావడం లేదు. కరోనా కట్టడిలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందనే ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

Also Read: మీడియా రంగంలోకి బీజేపీ? ఆ రెండు చానెళ్లతో చర్చలు!

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక చాలామంది నేతలు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ మంత్రివర్గ కూర్పు దగ్గరి నుంచి ప్రతీఒక్కటి ఆచితూచి పదవుల పంపకం చేస్తున్నారు. గత క్యాబినెట్లో కొనసాగిన ముగ్గురు మంత్రులను కేసీఆర్ పక్కన పెట్టిన సంగతి తెల్సిందే. దీంతో ఆ నేతలంతా సైలంటయ్యారు. వీరితోపాటు మరికొందరు పదవులపై ఆశలు పెట్టుకొని పదవులు రాకపోవడంతో సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న తరుణంలోనే పలువురు టీఆర్ఎస్ నేతలు తమలోని అసంతృప్తిని బయటికి వెళ్లగక్కుతోన్నారు.

ఇటీవల టీఆర్ఎస్ కు చెందిన కీలక నేత, మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ కేసీఆర్ పై డైరెక్ట్ గానే విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ లో ఉద్యమకారులకు గుర్తింపు లేదని.. తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన వారికే కేసీఆర్ కీలక పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్ లు తమకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. గతంలో ఎన్నడూ టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను, ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేసిన దాఖల్లేవు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో లోలోపల అసంతృప్తి బాగానే ఉందనే సంకేతం ప్రజల్లోకి వెళ్లింది.

Also Read: బై బై గణేశా.. సందడి లేకుండానే విగ్రహాల నిమజ్జనం

అదేవిధంగా కేసీఆర్ క్యాబినెట్లో పదవులు ఆశించిన భంగపడిన నేతలు కూడా సైలంటయ్యారు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, రెడ్యానాయక్, జూపల్లి కృష్ణారావు, మాజీ స్పీకర్ మధుసూధనచారి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ తదితరులంతా కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్నారనే టాక్ విన్పిస్తోంది. సరైన సమయం దొరికినప్పుడు కేసీఆర్ పై ఫైరయ్యేందుకు రెడీగా ఉన్నారు.

ఇక త్వరలోనే దుబ్బాకలో ఉప ఎన్నిక రానుంది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఆ సీటును దక్కించుకోవడం ఆపార్టీకి కీలకంగా మారింది. అయితే ఓవైపు టీఆర్ఎస్ లో నెలకొన్న అసంతృప్తి.. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. సొంత పార్టీ నేతలే కారు స్పీడుకు బ్రేకులు వేస్తుండటంతో సీఎం కేసీఆర్ స్టీరింగ్ ను ఎలా మలుపు తిప్పుతారనేది ఆసక్తికరంగా మారింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular