Bhumana Karunakar Reddy
Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. తీవ్ర తర్జనభర్జనల నడుమ కరుణాకర్ రెడ్డి పేరును సీఎం జగన్ ఖరారు చేశారు. గత నాలుగేళ్లుగా వై వి సుబ్బారెడ్డి ఆ పదవిలో కొనసాగుతున్నారు. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వై వి నియమితులయ్యారు. రెండోసారి ఆయనకు కొనసాగింపు లభించింది. ఈ లెక్కన వైవి సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు పదవులు కొనసాగారు. చివరి ఏడాది వెనుకబడిన వర్గాల వారికి చైర్మన్ పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు.
కీలక పదవుల్లో సీఎం సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని విమర్శలు చుట్టుముట్టాయి. దీనికి బ్రేక్ చెప్పాలని టీటీడీ చైర్మన్ పదవిని వెనుకబడిన వర్గాల వారికి కేటాయించాలని భావించారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి యాదవ్ పేరు బలంగా వినిపించింది. పిల్లి సుభాష్ చంద్రబోస్, సిద్దా రాఘవరావు వంటి వారు పదవిని ఆశించారు. అదే సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి సైతం తనకు పదవి కేటాయించాలని కోరారు.
కరుణాకర్ రెడ్డి పార్టీలో సీనియర్. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు. జగన్ తొలి క్యాబినెట్లో మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణల్లో పదవి ఇవ్వడం సాధ్యం కాలేదు. మంత్రివర్గ విస్తరణలోనైనా అవకాశం కల్పిస్తారని భావించారు. కానీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొనసాగించడం.. ఆర్కే రోజాకు చోటు ఇవ్వడంతో కరుణాకర్ రెడ్డిని పరిగణలోకి తీసుకోలేదు. దీంతో కొద్ది రోజులు పాటు భూమన కరుణాకర్ రెడ్డి సైలెంట్ అయ్యారు. ఎట్టకేలకు ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి బాధ్యతలును అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు తిరుపతి నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి అప్పగించారని తెలుస్తోంది. కాగా తనను టీటీడీ చైర్మన్ గా నియమించిన సీఎం జగన్కు కరుణాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు