Homeజాతీయ వార్తలుబస్తీ పెద్దన్న.. బుల్లెట్ నర్సన్న..  భాగ్యనగరిలో నాయిని గురుతులు

బస్తీ పెద్దన్న.. బుల్లెట్ నర్సన్న..  భాగ్యనగరిలో నాయిని గురుతులు

హైదరాబాద్  బస్తీలకు పెద్దన్న.. నాయిని నర్సింహరెడ్డి. భాగ్యనగరంతో ఆయన అనుబంధం విడదీయరానిది.. బుల్లెట్ నర్సన్న అని ఆప్యాయంగా పిలుచుకునే జనాలు.. అనునిత్యం కార్మికుల సేవలలోనే తరించిన ఆయన నైజం.. కష్టసుఖాల్లో వారికి అండదండగా నిలిచిన పెద్ద మనిషి.. ఆయన ఆత్మబలం.. గంభీర స్వరం.. కార్మికుల కోసం ఎంతకైనా తెగించి పోరాడే తత్వం.. ఇవన్నీ నాయిని నర్సింహరెడ్డి ఆభరణాలు..  అనారోగ్యంతో బుధవారం అర్ధరాత్రి నాయిని మరణించడంతో ఆయన అభిమానులు తల్లడిల్లారు. టీఆర్ఎస్ సహ వివిధ రాజకీయ పక్షాలు, కార్మిక, ప్రజాసంఘాల ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.

Also Read: నాయిని అన్నా.. ఒగ్గేసి పోయావా?

పదేళ్ల  వయస్సులో నిజాం పోలీసులు జరిపిన కాల్పుల్లో తండ్రిని కోల్పోయిన నాయిని  కుటుంబం సొంతూరు నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ నుంచి దేవరకొండ గ్రామానికి వెళ్లింది. 4వ తరగతి చదువుతున్నపుడు ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ పార్టీ మీటింగ్ కు నాయిని వెళ్లారు. తర్వాత సోషలిస్టు పార్టీలో చేరారు. రాజకీయాలు, యజమాన్యాలకు అతీతంగా కార్మికుల కోసమే పనిచేయాలనే ఉద్దేశంతో హింద్ మజ్దూర్ సభ సిద్ధాంతాలను ఔపోసన పట్టి ఆచరించారు. బేగంబజార్ పహిల్వాన్ లతో కుస్తీ పట్టేవారు.  మోడ్రన్ బేకరీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రూ.6,700కు బుల్లెట్ కొని సవారీ చేసేవారు. ఆ వాహన సౌండ్ వింటూ నాయిని ఎంత దూరంలో ఉన్నాడో పలువురు పందేం కాసేవారు.

హైదరాబాద్ లోని సోషలిస్టు పార్టీ ఆఫీస్ నుంచి పేపర్ ప్రకటనలు ఇచ్చేందుకు ట్యాంక్ బండ్ పై తిరిగేవారు. ధోవతి కట్టు, మీసం కట్టు, మల్ల యోధుడి రూపం.. గంభీర స్వరం ఆయనకు వన్నెలు అద్దాయి. రష్యా లో మే డే ఉత్సవాలకు వెళ్లినప్పుడు, అమెరికాలో తానా సభలకు హాజరైనప్పుడు సైతం ఇదే ధోవతి కట్టుతో పాల్గొనడం విశేషం. చార్మినార్, బేగం బజార్, కోవాబేలా, లాడ్ బజార్ లో చిరు వ్యాపారులతో యూనియన్ ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో చంచల్ గూడ జైలులో ఉన్నారు. తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు.

Also Read: ఏపీ ప్రజలకు రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లి.. కానీ..?

హుస్సేన్ సాగర్ ఒడ్డున జలదృశ్యంలో  టీఆర్ఎస్   కార్యాలయం ప్రారంభించి గులాబీ జెండా ఎగురవేసి.. తుదిశ్వాస విడిచే వరకు గులాబీ కండువాతోనే ఉన్నారు. ధీర, గంభీర స్వరంతో నాయిని సాగించిన పోరాటం మరిచిపోలేనిది. 1978 శాసన సభ ఎన్నికల్లో ముషీరాబాద్ శాసన సభ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా నాయిని పోటీ చేశారు. తర్వాత అక్కడి నుంచే రెండు సార్లు  గెలుపు బావుటా ఎగిరేశారు. మూడు సార్లు ఓడారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular