తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల జగడం అటూ ఇటూ తిరిగి సుప్రీం కోర్టు చెంతకు చేరుతోంది. ముందుగా కృష్ణాబోర్డుకు ఇరు రాష్ట్రాలూ లేఖలు రాశాయి. కానీ.. పరిష్కారం రాలేదు. ఆ తర్వాత కేంద్ర జలశక్తికి ఉత్తరాలు వెళ్లాయి. అక్కడి నుంచీ జవాబు రాలేదు. ఆ తర్వాత నేరుగా ప్రధానికి సైతం లేఖలు వెళ్లాయి. రెండు సార్లు ఉత్తరం రాసినా.. ప్రధాని మోడీ చర్యలు తీసుకోలేదు సరికదా, కనీసంగా స్పందించలేదు. దీంతో.. ఇక లాభం లేదనుకొని సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాయి రాష్ట్రాలు.
ఇప్పటికే.. ఏపీ సర్కారు న్యాయ నిపుణులతో చర్చించి ఫిర్యాదును సిద్ధం చేస్తోంది. అంతర్రాష్ట్ర నదుల మధ్య నిర్మించిన ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, వాటి నిర్వహణ, భద్రతల బాధ్యతను సైతం కేంద్రానికి అప్పగించాలని ఈ పిటిషన్లో కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో విధి విధానాలు ఖరారు చేసేలా కృష్ణా బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నట్టు సమాచారం.
వాస్తవానికి రాష్ట్రాల మధ్య జలాల పంపకాలను ట్రైబ్యునళ్లు ఎప్పుడో ఖరారు చేశాయని, వాటిని సక్రమంగా అమలు చేసేందుకు ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడుతుందని ఏపీ సర్కారు సుప్రీం ధర్మాసనం ముందు వాదించబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. తెలంగాణ సర్కారు ఇప్పుడు చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తి మానవ హక్కుల ఉల్లంఘన అని వాదించబోతోందట.
తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా.. విలువైన నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని, తద్వారా ఆహార భద్రతకూ చేటు చేస్తోందని పిటిషన్లో ఏపీ సర్కారు పేర్కోనుందట. ఇదే సమయంలో.. కేంద్రం పైనా ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. జల వివాదంపై కంప్లైంట్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రశ్నించడం లేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతోందట.
ఇటు తెలంగాణ సైతం తన వాదనను గట్టిగానే వినిపించేందుకు సిద్ధమవుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమంగా నిర్మిస్తున్నారని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించినా.. ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారని చెప్పబోతోందని సమాచారం. కృష్ణా బోర్డును సైతం రానివ్వలేదని కూడా చెప్పనుంది. అదే సమయంలో.. జల విద్యుత్ ద్వారా ఏపీకి నష్టం జరుగుతుందన్న వాదనను సైతం తిప్పి కొట్టేందుకు సిద్ధమవుతోంది. తమ వాటాగా ఉన్న జలాలను మాత్రమే వినియోగించుకుంటున్నామని, ఏపీ చేస్తున్న వాదనల్లో వాస్తవం లేదని చెప్పనుందట.
అయితే.. రాష్ట్రాలు ఈ విధంగా సుప్రీం మెట్లు ఎక్కితే.. కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్టు కాదా? అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. రెండు రాష్ట్రాలను ఈ విషయంలో కూర్చోబెట్టి మాట్లాడలేకపోవడం.. తనను కాదని సుప్రీం దాకా వెళ్లడం అవమానం కాదా? అని అంటున్నారు. ఒకవేళ సుప్రీం వద్దకు వెళ్లినా.. అక్కడికి సైతం కేంద్రం బోనులోకి వెళ్లి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా జరిగే బదులు.. కేంద్రమే ఈ సమస్యను పరిష్కరిస్తే.. గౌరవప్రదంగా ఉంటుంది కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ.. రెండు రాష్ట్రాలు రాజకీయంగా గేమ్ ఆడుతున్నాయనే ఆలోచనలో కేంద్రంలోని బీజేపీ ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి, ఏం జరుగుతుంది? రాష్ట్రాలు సుప్రీం చెంతకు వెళ్తే.. కేంద్రం ఎలా స్పందిస్తుంది? అన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ap and telangana states going to file a petition on krishna water dispute
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com