ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ మధ్య తలెత్తిన జల వివాదం రోజుల తరబడి కొనసాగుతోంది. గొడవ ముదిరిందే తప్ప.. పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రెండు రాష్ట్రాలు కృష్ణా బోర్డుకు లేఖలు రాశాయి. జగన్ సర్కారు మరో అడుగు ముందుకేసి కేంద్ర జలసంఘం, ప్రధాని మోడీకి సైతం ఉత్తరమేశారు. కానీ.. అటు నుంచి జవాబు రానేలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జల జగడాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు న్యాయ నిపుణులతో చర్చిస్తోంది.
ఈ నేపథ్యంలో సుప్రీం ఎదుట కీలక వాదనలు వినిపించబోతోంది ఏపీ సర్కారు. అంతర్రాష్ట్ర నదుల మధ్య నిర్మించిన ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, వాటి నిర్వహణ, భద్రతల బాధ్యతను సైతం కేంద్రానికి అప్పగించాలని ఈ పిటిషన్లో కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో విధి విధానాలు ఖరారు చేసేలా కృష్ణా బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలని కోరనున్నట్టు సమాచారం.
వాస్తవానికి రాష్ట్రాల మధ్య జలాల పంపకాలను ట్రైబ్యునళ్లు ఎప్పుడో ఖరారు చేశాయని, వాటిని సక్రమంగా అమలు చేసేందుకు ఈ విధంగా చాలా బాగా ఉపయోగపడుతుందని ఏపీ సర్కారు సుప్రీం ధర్మాసనం ముందు వాదించబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. తెలంగాణ సర్కారు ఇప్పుడు చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తి మానవ హక్కుల ఉల్లంఘన అని వాదించబోతోందట. బచావత్ అవార్డు ప్రకారం.. ప్రాజెక్టుల్లోని నీటిని మొదటగా తాగు అవసరాలకు, ఆ తర్వాత సాగు అవసరాలకు వినియోగించాలని, ఆ తర్వాతే విద్యుత్ ఉత్పత్తి చేపట్టాల్సి ఉందని.. కానీ, తెలంగాణ సర్కారు మాత్రం ఇది ఖాతరు చేయట్లేదని వాదించబోతోంది. ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనేనని సుప్రీంకు తెలియజేయబోతోందట.
తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా.. విలువైన నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని, తద్వారా ఆహార భద్రతకూ చేటు చేస్తోందని పిటిషన్లో ఏపీ సర్కారు పేర్కోనుందట. ఇదే సమయంలో.. కేంద్రం పైనా ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. జల వివాదంపై కంప్లైంట్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రశ్నించడం లేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతోందట. ఈ విధంగా పటిష్టమైన ఫిర్యాదును సుప్రీం ముందు ఉంచబోతున్నామని, న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఏపీ సర్కారు భావిస్తోందట. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇదే జరిగితే.. కేసీఆర్ ఆట కట్టైనట్టేనని అంచనా వేస్తోందట.