తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా.. చంద్రబాబు ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చిక్కుల్లో పడ్డారు. పత్రిక, చానెల్ ను అడ్డుపెట్టుకొని ఏపీలోని జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్న ఆయనకు తాజాగా ఏపీ కలెక్టర్లు అంతా కలిసి మూకుమ్మడిగా షాక్ ఇచ్చారు.
Also Read: పవన్ కళ్యాణ్ సైలెన్స్ వెనుక ఇంత వైలెంటా?
పత్రికను అడ్డుపెట్టుకొని ఏమైనా రాయచ్చని.. అభాసుపాలు చేయవచ్చని అనుకున్న ఏబీఎన్ రాధాకృష్ణకు తాజా పరిణామం మింగుడుపడడం లేదు. తరచూ సంచలనమైన కథనాలతో ఏపీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రికకు తాజాగా ఏపీలోని 13మంది కలెక్టర్లు అంతా కలిసి లీగల్ నోటీసులు పంపడం సంచలనమైంది.
తాజాగా ఆంధ్రజ్యోతి పత్రికలో ‘హనీట్రాప్’ పేరుతో ఇద్దరు కలెక్టర్లపై ప్రచురించిన కథనం సంచలనమైంది. ఒక కలెక్టర్ ఒక మహిళను ప్రయోగించారని.. ఇంకో కలెక్టర్ కు అమ్మాయిల బలహీనత ఉందని.. అతడి దెబ్బకు పలువురు మహిళలు ఇబ్బందులు పడ్డారని కథనంలో ప్రచురించారు.
దీనిపై సీరియస్ అయిన ఏపీ కలెక్టర్లు మూకుమ్ముడిగా ఆంధ్రజ్యోతికి నోటీసులు పంపారు. సదురు మీడియా సంస్థ ఎండీ రాధాకృష్ణతోపాటు మరో ముగ్గురిని బాధ్యులను చేస్తూ నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రజ్యోతి కథనంపై కలెక్టర్లు అంతా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. కలెక్టర్ల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా.. వారిపై దాడి చేసేలా ఈ కథనం ప్రచురించారని వారంతా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ఇన్ టాక్ : తెదేపా సోషల్ మీడియా vs సోము వీర్రాజు !
కలెక్టర్ల పరువు తీసేలా కథనం ప్రచురించినందుకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని.. దాన్ని పత్రికలో ప్రచురించాలని వారు సూచించారు. వారంలోపు స్పందించకపోతే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
దీన్ని బట్టి తప్పుడు కథనాలతో వార్తలు రాస్తే వదిలిపెట్టేది లేదని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి జగన్ సర్కార్ గట్టి హెచ్చరికనే పంపినట్టు అర్థమవుతోంది. మరి ఇలాంటి బెదిరింపులకు లొంగని ఆర్కే ఈ విషయంలో ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తిగా మారింది.