Homeఆంధ్రప్రదేశ్‌విజయవాడ బరిలో ఎంఐఎం.. అధికార పార్టీ వ్యూహమేనా?

విజయవాడ బరిలో ఎంఐఎం.. అధికార పార్టీ వ్యూహమేనా?

AIMIM
సీఎం జ‌గ‌న్ తో ఎంఐఎం దోస్తానా ఈనాటిది కాదు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ వైసీపీకి ఓటేయండి అంటూ బ‌హిరంగంగానే అస‌దుద్దీన్ పిలుపునిచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన చేసిన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏక్ థమ్ జగన్‌కు సపోర్ట్ చేశారు. ముస్లింలు ఎవరూ టీడీపీకి ఓట్లు వేయవద్దని ప్రచారం చేశారు. నిజానికి ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట ఎంఐఎం పోటీ చేస్తూ వస్తోంది. కానీ.. ఒక్క ఏపీలో మాత్రం బరిలోకి దిగలేదు.

Also Read: కాల్వ మెడకు ఎన్నికల కమిషన్ ఉచ్చు

అంత సన్నిహిత సంబంధాలు ఉన్న మజ్లిస్ ఇప్పుడు.. కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం విజయవాడ నుంచి పోటీ చేస్తోంది. ముస్లిం ఓటర్లు మెజార్టీగా ఉన్న రెండు డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులను అధికారికంగా పోటీకి నిలబెట్టింది. 50, 54 డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వారి తరపున హైదరాబాద్ నుంచి నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. ముస్లిం ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బెజవాడలో అడుగుపెడతామని ఎంఐఎం నేతలు ధీమాగా ఉన్నారు.

బెజవాడలో ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా పోవడం.. గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వైసీపీ అనేకానేక రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఎంఐఎం అభ్యర్థులు నిలబడ్డారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. మజ్లిస్ పోటీ చేయాలనుకుంటే ముందుగా కర్నూలు ఆ పార్టీకి గమ్యంగా ఉండాలి. అక్కడ ఆ పార్టీకి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో పోటీ చేసింది.

Also Read: పడిపోయిన హైదరాబాద్ గ్రాఫ్‌.. 2014లో 4వ ర్యాంక్.. ఇప్పుడు 24..

తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోటీచేయాలి. అక్కడ ఎప్పుడూ ముస్లిం అభ్యర్థి మాత్రమే గెలుస్తుంటారు. అవన్నీ వదిలేసి.. ఏపీ రాజధాని సెంటిమెంట్ పనిచేస్తుందని భావిస్తున్న విజయవాడలోని రెండు డివిజన్లలో పోటీచేయడం ఖచ్చితంగా వైసీపీ రాజకీయ వ్యూహాల్లో భాగమేనని భావిస్తున్నారు. మజ్లిస్ ఇతర పార్టీల రాజకీయ వ్యూహాల కోసం.. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసి ఓట్లు చీలుస్తుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఇదంతా అధికార పార్టీ ఎత్తుగడలో భాగమేనని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular