కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి దేశం మొత్తం 21 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించడంతో దేశ వృద్ధి రేటుపై దారుణమైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. దేశ వార్శిక వృద్థిరేటు కేవలం 2.5శాతానికే పరిమితం కావచ్చని బార్క్లే బ్యాంకు అంచనా వేసింది. ఈ ఏడాది దేశ వృద్దిరేటు 4.5శాతం ఉండవచ్చని గతంలో అంచనా వేశారు. కానీ ఈ ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో లాక్డౌన్ ప్రభావం అసాధారణంగా ఉంటుందని బార్క్లే తెలిపింది.
పైగా, 2021 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ఉత్పాతం ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వృద్ధి రేటు ముందుగా అంచనా వేసినట్లు 5.2శాతం ఉండదని, అది కేవలం 3.5శాతానికే పరిమితం అవుతుందని తాజాగా అంచనా వేసింది. లాక్డౌన్.. దేశ ఆర్థిక వ్యవస్థను రూ.9 లక్షల కోట్ల మేర ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ జీడీపీలో ఈ మొత్తం 4 శాతానికి సమానం కావడం గమనార్హం.
ఇలా ఉండగా, కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం సూచించినా తమకు పూర్తిగా సాధ్యం కాదని పలు ఐటీ కంపెనీల అధిపతులు స్పష్టం చేస్తున్నారు. లాక్డౌన్ నుంచి మినహాయింపు లభించిన రంగాల్లో ఐటీ లేకపోవటంతో ఆయా ఉద్యోగులందరూ ఇండ్లకే పరిమితం కావాల్సి వస్తున్నది.
దాంతో తాము జాతీయ అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు అందించటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భారతీయ ప్రముఖ ఐటీ సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్ సీఈవోలు సోషల్ మీడియా ద్వారా అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అత్యవసర సేవలు అందిస్తున్న పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు తమ సేవలు ఆగిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల కొంతమంది ఉద్యోగులైనా ఆఫీసు నుంచి పనిచేయాల్సిందేనని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు.
ఇంకోవైపు, వ్యాపారస్తులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించే పరిస్థిలో లేమని చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, టూరిజం, ఆతిథ్యరంగాల వ్యాపారాలు కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. వ్యాపారాలు పూర్తిగా మూత పడటంతో కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్తితిలోకి కంపెనీలు జారుకున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాల కోసం బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించలేమని పలు సంస్థల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. వ్యాపార నిబంధనల్లోని యాక్ట్ ఆఫ్ గాడ్ (దేవుడి లీల) సెక్షన్ ఇప్పుడు తమకు వర్తిస్తుందని, ఆ మేరకు వెసులుబాటు ఇవ్వాలని అంటూ ఉండడంతో బ్యాంకులు ఖంగారు చెందుతున్నాయి. అదే జరిగితే తమకు కుప్పకూలి పోవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నాయి.