కరోనా సమస్య తీవ్రతరం కావడంతో మే లో జపాన్ లోని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ను రద్దు చేయాలని ప్రపంచ వ్యాప్తంగా వత్తిడి వస్తున్న దృష్ట్యా అనుకున్న విధంగానే జరుపుతామని ఇప్పటి వరకు పట్టుబడుతున్న జపాన్, ఒలింపిక్స్ సమాఖ్య సహితం ఇప్పుడు మెత్తబడి వాయిదాకు సిద్ధం అన్న సంకేతం ఇచ్చారు.
తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు గాని మొత్తం మీద పోటీల రద్దు జరిగే ప్రసక్తి లేదని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య తేల్చి చెప్పింది. ఇప్పటికే పలు దేశాలు ఒలింపిక్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించడంతో దిగిరాక తప్పడం లేదు. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఒలింపిక్స్లో పాల్గొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి.
అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఇరాన్ తదితర దేశాలు కూడా ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య కూడా క్రీడలను వాయిదా వేయడానికి సిద్దపడవలసి వస్తున్నది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవంక ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ ప్రశ్నార్థకంగా మాడడంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. వీటి కోసం సంవత్సరాల తరబడి సిద్దపడుతుంటే ఇప్పుడు వాయిదా ఏమిటని విస్తు పోతున్నారు.
ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియాలు తమ అథ్లెట్లను టోక్యో ఒలింపిక్స్కు పంపేది లేదని స్పష్టం చేశాయి. ఇప్పటి వరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ను నిర్వహించాలని భావించామని, అయితే క్రీడల కంటే పోటీల్లో పాల్గొనే అథ్లెట్ల ఆరోగ్యమే తమకు ముఖ్యమని జపాన్ ప్రధాని షింజో అబె ప్రకటించడం గమనార్హం.
క్రీడాకారుల ప్రాణాలను పనంగా పెట్టి పోటీలను నిర్వహించాలనేది తమ ఉద్దేశం కాదని ప్రధాని స్పష్టం చేశారు. ఈ విషయంలో సభ్య దేశాలు, ఒలింపిక్స్ సమాఖ్యతో చర్చించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.