12 డిగ్రీల చలిలో 96 వేల ట్రాక్టర్లు, కోటి ఇరవై లక్షల మంది రైతులు.. సర్కారు ఆంక్షలు, పోలీసుల బారీకేడ్లు దాడుకొని ఢిల్లీ నడిబొడ్డున పోరాటం చేయడం మామూలు విషయం కాదు. దేశ చరిత్రలోనే ఇదో రికార్డు. ఇంతకు రైతులు వద్దంటున్న అగ్రి చట్టాల్లో ఏముంది..? ఇది వరకు చట్టాలకు చేసిన మార్పులేంటి.. ?
*కేంద్ర తెచ్చిన చట్టాలేంటి..?
కేంద్రప్రభుత్వం 3 రకాల చట్టాలకు సవరణలు చేసింది. ఇంతకుముందు నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు వాటి నిలువలపై పరిమితులు ఉండేవి. ఏ సరుకైనా కేంద్రం చెప్పిన పరిమితి మేరకే నిలువ చేసుకోవాలన్నమాట. కృత్రిమ కొరత సృష్టిస్తే సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకురేవారు. ప్రస్తుతం చట్టంలో ఈ పరిమితులను పూర్తిగా ఎత్తేశారు. అంటే రైతులనుంచి రీటైలర్ వరకూ ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. నిత్యవసర సరుకులు, కూరగాయల ధరలు 50 శాతం పెరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం నిలువలపై ఆంక్షలు విధిస్తుంది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
Also Read: రైతులకు అలర్ట్.. ఈ పంటతో ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం..?
*పంటలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు
రెండో చట్టం ప్రకారం రైతులు తాము పండించిన పంటలు, ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెలుసుబాటు కల్పించారు. ఇది వినడానికి బాగానే ఉంటుంది. కానీ, మన దేశంలో 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. స్థానికంగా ఉన్న మార్కెట్లకు వెళ్లి అమ్ముకోవాలంటేనే 25 శాతం దాకా రవాణా, ఇతర ఖర్చులు భరించాల్సి వస్తుంది. అలాంటది పక్క జిల్లా, పక్క రాష్ట్రానికి వెళ్లి అమ్ముకునే పరిస్థితి ఎక్కడ ఉంటుంది..? ఓ పదిమంది రైతులు కలిసి వెళ్లినా అక్కడ సరైన ధర రాకుంటే మొత్తానికే నష్టపోతారు.
*మద్దతు ధర ఏది?
గతంలో ప్రధాన పంటలకు సర్కారు మద్దతు ధర కల్పించేది. రైతులు పెట్టిన పెట్టుబడి ఖర్చులకు లెక్కలోకి తీసుకొని రైతులకు కొంతైనా లాభం వచ్చేలా ఈ ధర ఉండేది. కొత్త చట్టం ప్రకారం మద్దతు ధరను పూర్తిగా ఎత్తేశారు. పైగా దేశంలో ఏ వస్తువుకైనా కంపెనీలే ధర నిర్ణయిస్తాయి.. రైతు కూడా అలాగే ధర నిర్ణయించుకోవచ్చని ఇందులో పేర్కొన్నారు. కానీ, దేశంలో కోట్ల మంది రైతులకు ఇది సాధ్యమేనా.. ? సొంతంగా స్టోర్ చేసుకునే అవకాశమే లేదు. ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకునే స్థోమత అసలే ఉండదు.. లేట్ అయితే పంట పాడువుతుంది. అంటే తప్పనిపరిస్థితుల్లో కార్పొరేట్ కంపెనీలకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
*మూడో చట్టం.. కాంట్రాక్ట్ ఫార్మింగ్
మూడో చట్టం ప్రకారం రైతులతో కంపెనీలు కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయడానికి అనుమతులు ఇచ్చారు. అంటే రైతు ఏ పంట వేయాలో, ఏ ఎరువును వాడాలో కంపెనీలు నిర్ణయిస్తాయన్నమాట. అంతేకాదు రైతులతో 5 సంవత్సరాల వరకూ అగ్రిమెంట్ చేసుకునే అవకాశం కల్పించారు. రంగలోకి దిగేది కార్పొరేట్ కంపెనీలే కాబట్టి అగ్రిమెంట్లో ముందుగానే ధర నిర్ణయిస్తాయి. మార్కెట్లో ధరలు పెరిగినా రైతుకు మాత్రం అగ్రిమెంట్ ప్రకారమే డబ్బు ఇస్తారు. పోనీ కార్పొరేట్ కంపెనీలైనా దేశంలోనే అమ్ముతాయా అంటే.. అదీ ఉండదు. రెండో చట్టం ప్రకారం దేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ అమ్ముకునే అవకాశం కల్పించారు. దీన్ని ఆసరాగా చేసుకున్న కంపెనీలు రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులను నాలుగైదు రెట్లు ఎక్కువ రేటు పలికే దేశాల్లోనే అమ్ముకుంటాయి.
Also Read: జగన్ ధాటికి చంద్రబాబు రాజకీయ సన్యాసమేనా?
* భూమి నాశనం అవుతుంది..
కార్పొరేట్ కంపెనీలతో కాంట్రాక్ట్ వ్యవసాయం చేసే రైతుల భూములు పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. కంపెనీలు 5 ఏళ్ల పాటు అగ్రిమెంట్కు చేసుకుంటాయి కాబట్టి విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడుతాయి. దీంతో తరాలను బతికించాల్సిన భూమి ఐదేళ్లకే రసాయనాలతో నిండిపోయి సారం కోల్పోతుంది. గ్రౌండ్ వాటర్ పాతాలానికి చేరుతుంది. చివరికి రైతులు ఈ భూమిలో వ్యవసాయం చేయలేక ఆ కంపెనీలకో అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
*చేయాల్సిన మార్పులు ఇవి…
ప్రభుత్వం రైతులకు మేలు చేయాలంటే..కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసే కంపెనీ, ఎం.ఎస్. స్వామినాథన్ చెప్పినట్టు, రైతు పెట్టుబడికి 50 శాతం అదనంగా సొమ్మును కలిపి మద్దతు ధరగా చెల్లించాలి. రైతు ఉత్పత్తులు కొన్న కంపెనీ విదేశాలకు ఎక్స్ఫోర్ట్ చేయకూడదు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కేవలం సేంద్రియ ఎరువులు వాడాలి. ప్రభుత్వమే రైతు ఉత్పత్తులు కొని మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెట్ కమిటీలు, యార్డులపై శ్రద్ధ పెట్టాలి. ప్రతి గ్రామంలో కోల్డ్ స్టోరేజీలు గిడ్డంగులు, గోదాముల కట్టించాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెంచాలి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
అప్పుడే అటు రైతులు బాగుపడుతారు. కేంద్రం తెచ్చిన సంస్కరణలు ప్రజలకు మేలు చేస్తాయి. రైతులను ఒప్పించి మెప్పించకుండా ఇలాగే ముందుకెళితే మాత్రం కేంద్రంలోని బీజేపీకి ఇలాంటి కష్టాలే ఎదురువతాయి. రైతులు దండెత్తి ఢిల్లీ పీఠంపై ఉరికివచ్చేలా చేస్తాయి. ఎంత మంచి చట్టమైనా ప్రజల సమ్మతితో ముందుకెళ్లినప్పుడే అది కార్యరూపం దాల్చగలదని.. కేంద్రంలో బలం ఉందని ఏకపక్షంగా వెళితే మోడీ సర్కార్ కు తిప్పలు తప్పవని ఈ వ్యవసాయ చట్టాలతో కేంద్రానికి రైతులు తగిన గుణపాఠం చెప్పారనే చెప్పొచ్చు
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More