సీనియర్ రాజకీయ వేత్త, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావుకు మరోసారి రాజ్యసభ సీట్ లభించే అవకాశాలు కనబడటం లేరు. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగుస్తుంది. మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా, రెండో సారి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.ప్రస్తుతం సాంకేతికంగా ఏపీ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవరావు సభ్యత్వం ఏప్రిల్ 9తో ముగుస్తుంది.
తెలంగాణ నుండి ఎన్నిక కావలసిన మొత్తం నలుగురిని ఎన్నికయ్యేటట్లు చూడదగిన ఎమ్యెల్యేల భలం ఉన్నప్పటికీ సామజిక వర్గాల సమతూకంలో ఆయనకు మరోసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం లేకపోవచ్చని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంకా మిగిలే ముగ్గురు టీఆర్ఎస్ సభ్యులు కూడా బిసి వర్గాలకులు చెందినవారే కావడంతో ఈ సారీ ఇతర వర్గాలకు అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. రెడ్డి, వెలమ, ఎస్సి వర్గాలకు వరుసగా మూడు సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి.
వెలమ వర్గం నుండి సీఎం కుమార్తె కవిత, కేసీఆర్ సమీప బంధువైన వినోద్ కుమార్ ల పేర్లు వినబడుతున్నాయి. వీరిద్దరూ గత లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందిన వారే. ఓటమి తర్వాత కవిత రాజకీయంగా దాదాపు మౌనంగా ఉంటున్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు గురించి ఆందోళనలు జరుగుతున్నా ఆమె పట్టించుకోవడం లేదు.
వినోద్ కుమార్ ప్రస్తుతం రాష్త్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ లో ఉన్నప్పటికీ ఆయనకు రాజ్యసభ సీట్ పట్ల ఆసక్తి ఉన్నట్లు తెలుస్తున్నది. రెడ్డి సామజిక వర్గంలో అనేకమంది పోటీ పడుతున్నారు. కేసీఆర్ తమకు హామీ ఇచ్చారని మాజీ స్పీకర్ కె ఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ హోమ్ మంత్రి నాయని నరసింహ రెడ్డి భరోసాతో ఉన్నారు.
ఇక ఎస్సి, ఎస్టీ ల నుండి కూడా పలువురు సీట్లు ఆశిస్తున్నారు. అనూహ్యంగా రాజకీయాలతో సంబంధం లేకుండా పారిశ్రామిక వేత్తలను ఎవరినైనా కేసీఆర్ తెరపైకి తీసుకు వస్తారా అనే చర్చ కూడా జరుగుతున్నది.