కొద్దిరోజులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల చుట్టు జరుగుతున్న వివాదం.. తెలుగు నటుల మధ్య మాటల తూటాల నేపథ్యంలో అగ్ర హీరో చిరంజీవి రంగంలోకి దిగారు. మాటల తూటాలతో సినీ ఇండస్ట్రీ పరువు తీస్తున్నారని చిరంజీవి ఆయా నటులపై సీరియస్ అయ్యాడట..
‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో చిరంజీవి ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు తాజాగా చిరంజీవి లేఖ రాశారు.
‘మా’ ఎన్నికలు వెంటనే జరపాలని.. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని లేఖలో పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోందని.. ఎవర్నీ ఉపేక్షించవద్దని సూచించారు.
ప్రస్తుతం ఉన్నది ఆపద్ధర్మ కార్యవర్గమేనని.. వెంటనే ఎన్నికలు నిర్వహించి సమస్యను పరిష్కరించాలని కృష్ణంరాజును చిరంజీవి కోరారు. దీంతో ఈ విషయంలో మాటల మంటలను తగ్గించేలా చిరంజీవి ఈ చొరవ తీసుకున్నారు.
మా’ అధ్యక్షుడిగా నరేశ్ కార్యవర్గం కాలపరిమితి గత మార్చితోనే పూర్తయ్యింది. కరోనా వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రస్తుతం ‘మా’ అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహరావు పోటీలో ఉన్నారు.