చిన్న వయసులో ఆడపిల్లనమ్మా.. నేను ఆడపిల్లను అంటూ తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘సింగర్ మధు ప్రియ’ తాజాగా హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. గత కొంత కాలంగా ఆమెకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయి. మొదట ఎవరో ఆకతాయిలు అనుకుని పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ తనకు పదే పదే ఆ కాల్స్ వస్తుండటంతో మధు ప్రియ ఈ-మెయిల్ ద్వారా షీ టీమ్ కు ఈ రోజు ఫిర్యాదు చేసింది.
అయితే, ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాల విషయానికి వస్తే… ఈ కాల్స్ చేస్తోన్న వారే తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తున్నారని, అలాగే తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ తనను బాధ పెడుతున్నారని, తనను సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా కూడా వేధిస్తున్నారని మధు ప్రియ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక తనకు వచ్చిన అసభ్యకరమైన మెయిల్స్ ను కూడా మధుప్రియ షీ-టీమ్, సైబర్ క్రైం పోలీసులకు ఫార్వడ్ చేసింది.
అదేవిధంగా తనకు వస్తున్న బ్లాంక్ కాల్స్ కి సంబదించిన డిటైల్స్ ను సైబర్ క్రైం పోలీసులకు ఇచ్చింది. మధుప్రియ ఫిర్యాదు మేరకు ఐపీసీ 509, 354(బి) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. మధు ప్రియ చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి వ్యవహరంతో వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత మీడియాకి దూరంగా ఉన్న ఆమె, బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం ఆమె సినిమా సాంగ్స్ తో పాటు పలు షోలలో కూడా పాల్గొంటుంది. ఆమె పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి కూడా. ‘ఫిదా’ మూవీలో ఆమె పాడిన ‘వచ్చిండే… మెల్ల మెల్లగా వచ్చిండే’ పాటతో పాటు ‘హి ఈజ్ సో క్యూట్’ పాట కూడా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. మధు ప్రియ సింగింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. ఆమె తరహా పాటలు ఎవరూ పాడలేరనే విధంగా ఆమె పాటలు పాడుతుంది.