బాలీవుడ్ గాయని కనికా కపూర్ విదేశాల నుండి వచ్చి రాగానే లక్నోలో ఒక స్టార్ హోటల్ లో దావత్ లో పాల్గొనడంతో ఉన్నత రాజకీయ వర్గాలలో కలకలం చెలరేగింది. నాలుగైదు రోజుల తర్వాత ఆమెకు కరోనా వైరస్ ఉన్నట్లు తెలవడంతో ఆ దావత్ కు హాజరైన ప్రముఖులు అందరూ ఖంగారు పడుతున్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆమెపై లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆ దావత్ కు హాజరైన రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరరాజే, ఆమె కుమారుడు, బిజెపి ఎంపీ దుశ్యంత్ సింగ్, యుపి ఆరోగ్య మంత్రి వంటి పలువురు స్వీయనిర్బంధంలోకి వెళ్లారు. దుశ్యంత్ సింగ్ పార్లమెంట్ కు హాజరు కావడంతో పాటు, రాష్ట్రపతి భవన్ లో జరిగిన అల్పాహార విందుకు కూడా హాజరు కావడంతో రాష్ట్రపతి భవన్ అధికారులు సహితం కలవరం చెందుతున్నారు.
కనికా కపూర్ విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత కరోనా అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. అంతకు ముందే ఆమె పలు పార్టీలకు హాజరయ్యారు. ఈ పార్టీలకు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే తనకు కరోనా సోకినట్లు కనికా నిన్న ప్రకటించడంతో ఎవరైతే ఆమె పాల్గొన్న పార్టీలకు హాజరయ్యారో వారంతా తీవ్ర ఆందోళనకు గురై స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
కనికా హాజరైన పార్టీకి ఎంపీ దుష్యంత్ వెళ్లారు. ఆ తర్వాత రాజస్థాన్, యూపీ ఎంపీలకు మార్చి 18న రాష్ట్రపతి విందుకు దుష్యంత్ హాజరయ్యారు. దీంతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
కనిక విషయం తెలియగానే రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్, యూపీ ఆరోగ్య శాఖ మంత్రి జైప్రతాప్ సింగ్ తో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. దుష్యంత్ను కలిసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్.. క్వారంటైన్లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు.
ఎంపీ దుష్యంత్ ఇటీవల పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వరుణ్గాంధీతో సన్నిహితంగా మెలిగారు. ఈ నెల 18న జరిగిన పార్లమెంట్ స్థాయి సంఘం సమావేశంలో ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ రెండు గంటలపాటు దుష్యంత్ పక్కనే కూర్చున్నారు. గురువారం దుష్యంత్ హాజరైన ఓ దావత్లో అనుప్రియా పటేల్ పాల్గొన్నారు.
‘బేబీ డాల్’ సింగర్గా పేరున్న కనికాకపూర్ (41) ఈ నెల 10న లండన్ నుంచి ముంబైకి విమానంలో వచ్చారు. మరుసటి రోజు విమానంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చేరుకున్నారు. అక్కడే ఓ ఫైవ్స్టార్ హోటల్లో జరిగిన దావత్కు హాజరయ్యారు.
నాలుగు రోజుల కిందట జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించడంతో కనికాకపూర్ వైద్యపరీక్షలు చేయించుకున్నారు. నివేదికలో కరోనా పాజిటివ్ అని వచ్చిందని, తాను నిర్బంధంలోకి వెళ్తున్నానని ఆమె శుక్రవారం తన ఇన్స్టాగ్రామ్లో ప్రకటించడంతో ఈ దుమారం రేగింది.