Ram Charan: ఈ ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం తో ఏ రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. సినిమా యావరేజ్ రేంజ్ లో ఉన్నప్పటికీ, తన అద్భుతమైన నటన తో ఈ చిత్రాన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్లి సూపర్ హిట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి ఓటీటీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు వేరే రేంజ్ లో ఉన్నాయి.
అయితే సుకుమార్ సంగతి అందరికీ తెలిసిందే. సినిమా తీయడానికి చాలా ఆలస్యం చేస్తుంటాడు. కనీసం మూడేళ్ళ సమయం తీసుకుంటూ ఉంటాడు. అంటే రామ్ చరణ్ ని వెండితెర పై చూసేందుకు మరో మూడేళ్లు ఎదురు చూడాల్సిందేనా అని అభిమానులు నిరాశ పడుతున్నారు. అయితే అలాంటి అభిమానులకు ఒక శుభ వార్త. సుకుమార్ మూవీ కంటే ముందుగా రామ్ చరణ్ నుండి మరో సినిమా రాబోతుంది. అయితే హీరో గా కాదు, అతిథి పాత్రలో అన్నమాట. అంటే ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్, ‘కన్నప్ప’ చిత్రం లో ప్రభాస్ పాత్రలు ఎలాగో, రామ్ చరణ్ కూడా అలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అట. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే గుజరాతి భాషలో ‘లాలో’ అనే చిత్రం విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా, చాలా సాధారణమైన చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ట్రేడ్ పండితులు సైతం షాక్ కి గురయ్యే వసూళ్లను రాబట్టింది.
ఈ చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేసేందుకు ఒక ప్రముఖ నిర్మాత సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ శ్రీ కృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నాడు అట. ఈ వార్త తెలియగానే అభిమానుల్లో ఎక్కడలేని ఆనందం కలిగింది. ఎందుకంటే తమ అభిమాన హీరో ని కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ కృష్ణుడి పాత్రలో చూడబోతున్నామని. అయితే ఇది డైరెక్ట్ సినిమా అయ్యుంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు, కానీ ఇది ఒక రీమేక్ సినిమా అవ్వడం వల్ల అభిమానుల్లో ఎక్కడో ఒక మూల భయం మొదలైంది. ఎందుకంటే ఈమధ్య కాలం లో జనాలు రీమేక్ సినిమాలను థియేటర్స్ లో చూడడం ఆపేశారు. మరి ఈ చిత్రాన్ని జనాలు ఆదరిస్తారో లేదో చూడాలి.