Puri Jagannadh: మన టాలీవుడ్ లో కొంతమంది డైరెక్టర్స్ కి మాస్ హీరో కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ , క్రేజ్ ఉంటుంది. వాళ్ళ సినిమాల్లో హీరోగా ఎవరు నటిస్తున్నారు అనేది ఆడియన్స్ చూడరు. కేవలం ఆ డైరెక్టర్ పేరు కనిపిస్తే చాలు టికెట్స్ తెంపేస్తుంటారు. అలాంటి డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాథ్. ఒకే మూసలో వెళ్తున్న తెలుగు కమర్షియల్ సినిమా స్థితిగతులను మార్చిన మ్యావరిక్ డైరెక్టర్ ఆయన. ఇప్పటి తరం ప్రేక్షకులు ప్రశాంత్ నీల్ , సందీప్ వంగ, లోకేష్ కనకరాజ్ అంటే మెంటలెక్కిపోతుంటారు. కానీ పూరి జగన్నాథ్ పాత సినిమాలు చూస్తే వీళ్లంతా పిల్లలు అని అనిపించక తప్పదు. అది పూరి జగన్నాథ్ రేంజ్. ప్రభాస్ ఎంతో మంది టాప్ డైరెక్టర్స్ తో పని చేశారు. కానీ పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ ఈ ప్రపంచంలోనే ఉండరు అని ఒక ఇంటర్వ్యూ లో అంటారు ప్రభాస్.
దీన్ని బట్టీ ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పూరి జగన్నాథ్ నేడు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం లో నటించడానికి క్యూలు కట్టిన స్టార్ హీరోలు , ఇప్పుడు ఆయన దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. అంతే కాదు , ఫైనాన్సియల్ గా కూడా పూరి జగన్నాథ్ బాగా చితికిపోయారు. ఆయన ఎదురుకున్న ఆర్ధిక సమస్యల గురించి ప్రముఖ సంగీత దర్శకులు రఘు కుంచె గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొస్తారు , ఆ ఇంటర్వ్యూ లో ఆయన మాటలను చూసిన తర్వాత ఎవరికైనా కన్నీళ్లు రాక తప్పదు. ఆయన మాట్లాడుతూ ‘అప్పట్లో పూరి జగన్నాథ్ ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మాడు. కానీ ఆ వ్యక్తి సమయం చూసి పూరి జగన్నాథ్ కి దారుణంగా వెన్నుపోటు పొడిచాడు. దీంతో పూరికి భారీ గా ఆర్ధిక నష్టాలు వచ్చాయి’.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ ఆ అప్పులు తీర్చేందుకు పూరి జగన్నాథ్ పడిన సంఘర్షణ ఎలాంటిదో కళ్లారా చూసాను. ప్రతీ నెల 50 లక్షల రూపాయిల వడ్డీలు కట్టాల్సి వచ్చేది. ఈ కారణం చేత పూరి ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఆఫీస్ ని కూడా అమ్మేయాల్సి వచ్చింది. తర్వాత ఆయన ఒక అద్దె ఆఫీస్ ని ఏర్పాటు చేసుకునే దుస్థితి ఏర్పడింది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ పూరి ని మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరో పేరు మాత్రం చెప్పలేదు రఘు కుంచె. గతంలో పూరి కూడా ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ ‘ఆరోజుల్లో నేను ప్రభాస్, గోపీచంద్ , అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసేవాడిని , కానీ వచ్చిన డబ్బులు డబ్బులు మొత్తం అప్పులకే పోయేది, నేను ఎంతో ఇష్టం పెంచుకునే పెంపుడు జంతువులను పోషించే శక్తి లేక వేరే వాళ్లకి ఇచేయాల్సి వచ్చింది. ఇవన్నీ తల్చుకుంటే చాలా బాధ వేస్తుంది’ అంటూ ఎమోషనల్ అయ్యాడు పూరి జగన్నాథ్.