Maa Election: మా అద్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నటుడు ప్రకాశ్ రాజ్.. అనంతరం తన సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్యానెల్ సభ్యులు కూడా మీడయా సమావేశంలో మాట్లాడుతూ.. వారంతా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ విషయంపై నటి శ్రీరెడ్డి ఆసక్తికర కామెంట్ చేసింది. ప్రకాశ్ రాజ్ సహా ప్యానెల్ సభ్యులు రాజీనామా చేయడం వెనక మెగా బ్రదర్స్ హస్తం ఉందని ఆరోపించింది. ఎప్పటినుంచో తమ ఆధీనంలో ఉన్న మా అసోసియేషన్ చేజారిపోయినందువల్ల పవన్, నాగబాబు కలిసి ఈ డ్రామా క్రియేట్ చేశారని పేర్కొంది. మా ఎలక్షన్స్లో అన్యాయం జరిగిందంటూ.. ప్రకాశ్రాజ్, ప్యానెల్ సభ్యులు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారంటూ మండిపడింది. ముఖ్యంగా నటులు హేమ, ఉత్తేజ్, బెనర్దీ, తనీశ్, శ్రీకాంత్లపై తీవ్రంగా విరుచుకుపడింది.
రాజీనామా చేసిన ప్రకాశ్రాజ్ ప్యానల్ ఓటమిని ఒప్పుకోవాలని చెప్పింది. ‘మా’కు సేవ చేస్తానని చెప్పిన వాళ్లు చిత్ర పరిశ్రమను రెండుగా ఎందుకు చీలుస్తున్నారని ప్రశ్నించింది. మోహన్బాబు చిత్రసీమకు పెద్దదిక్కులాంటివారని పేర్కొంది.
ఓటమి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రకాశ్రాజ్… మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్యానెల్ సభ్యులు కూడా ఎన్నికలు జరిగిన తీరును తిరస్కరిస్తూ.. తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే బెనర్జీ, శ్రీకాంత్, తనీశ్ తదితర ప్యానెల్ సభ్యులు ఎన్నికల్లో జరిగిన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ప్రకాశ్రాజ్ మరో అసోసియేషన్ పెడతారని వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. అవన్నీ కేవలం పుకార్లని అటువంటి ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.