బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోషల్ మీడియాలో ఏ విధంగా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందే. తనపై ఎవ్వరు కామెంట్ చేసినా సహించలేని కంగనా.. తాను మాత్రం అందరిపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులను ఉగ్రవాదులు అంటూ మాట్లాడిన కంగనా.. వారికి సపోర్టు చేస్తున్న వారు కూడా ఉగ్రవాదులేనని కామెంట్ చేసింది.
ఏ విషయంలోనైనా తనకు నచ్చకపోతే చాలు.. ఎదుటివారిపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. ఈ పద్ధతిపై ట్విటర్ పలుమార్లు హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు ట్వీట్లను కూడా తొలగిస్తూ వచ్చింది. అయితే.. ఆమెలో ఎలాంటి మార్పూ రాలేదు.
తాజాగా.. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకొని వివాదాస్పద కామెంట్ చేసింది కంగనా. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ట్విటర్ ఆమె ఖాతాను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. తమ నిబంధనలు పాటించకపోతే ఎవరి ఖాతానైనా రద్దు చేస్తామని తేల్చి చెప్పింది.
దీనిపై ట్విటర్ ప్రతినిధి మాట్లాడుతూ… ట్విటర్ వేదికపై హింసను ప్రేరేపించే విధంగా ఎవరు మాట్లాడినా.. తాము కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్వేషపూరితమైన ప్రసంగాలు, హింసను ప్రేరేపించే ప్రకటనలు పదేపదే చేస్తున్నందునే కంగనా ఖాతాను శాశ్వతంగా రద్దు చేస్తున్నట్టు తెలిపారు.