కరోనా వైరస్ ప్రభావం తో మొత్తం సినిమా రంగం అంతా కుదేలు అయిపోవడంతో, సినీ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని గ్రహించి, వారికి ఎంతో కొంత మేలు చేయాలని తెలుగు సినీ రంగానికి చెందిన పెద్దలు నడుం బిగించారు. ఈ విషయంలో దేశంలోని మిగతా భాషల తారలతో పోలిస్తే తెలుగు హీరోలు సహాయం చెయ్యడం విషయంలో కొంచెం ముందే ఉన్నారు. సినీ కార్మికుల కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం మొదలెట్టారు. `కరోనా క్రైసిస్ చారిటీ ` ( సి సి సి ) అనే నిధిని ఏర్పాటు చేశారు. మెగాస్టార్ చిరంజీవి అద్వర్యంలో ఈ సేవా కార్యక్రమాల్ని నడిపిస్తున్నారు. ఇప్పటిదాకా టాలీవుడ్ కార్మికుల కోసం రూ.7 కోట్లకు పైగానే విరాళాలు వసూలైనట్లు తెలుస్తోంది.
ఈ విరాళాల నుంచి సాయం కావాల్సిన కార్మికులందరూ తమ పేర్లను ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసి యేషన్ , 24 క్రాఫ్ట్స్ కి చెందిన సినీ సంస్థల వద్ద నమోదు చేసుకోవాలి. అలా అన్నిసినీ క్రాఫ్ట్స్ కి చెందిన కార్మికుల వివరాలు సేకరించి.. వారికి ఎలక్ట్రానికి గుర్తింపు కార్డులు ఇస్తున్నారు.
ఈ ఎలక్ట్రానిక్ గుర్తింపు కార్డుల్ని సినీ కార్మికులకు అందజేసి తద్వారా ఒక నెలకు సరిపడా 2250 రూపాయల విలువైన నిత్యావసర సరకులు ఇవ్వబోతున్నారు. దీంతో పాటు కొంత ఆర్థిక సాయం కూడా ఇవ్వనున్నారు .. ఈ కార్డుల్ని మొబైల్ నంబర్ తో అనుసంధానం చేయడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్క కార్మికుడికీ సాయం అందుతోందా లేదా అన్నది పర్యవేక్షణ చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ లాక్ డౌన్ పొడిగిస్తే ఇంకో నెల కూడా ఇలాగే సాయం అందిస్తారు.
అదలా ఉంటే ఈ ఎలక్ట్రానిక్ కార్డు తో పాటు మందుల చీటీ పట్టుకుని అపోలో మెడికల్ షాప్ కి వెళ్తే రూ.500 మొత్తానికి సరిపడా మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వబడతాయి. రామ్ చరణ్ సతిమని , చిరంజీవి కోడలు అయిన ఉపాసన కొణెదల ఈ ఉచిత మందుల పంపిణీ కి పూనుకోవడం విశేషం .