అప్పటి వరకు బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ అందించే వ్యక్తిగా ఇండస్ట్రీ జనాలకు మాత్రమే తెలిసిన రాజ్ కుంద్రా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టిని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత దేశం మొత్తానికీ తెలిసిపోయాడు. అయితే.. ఇప్పుడు ఉన్నట్టుండి అశ్లీల వీడియోల తయారీ కేసులో పోలీసులు ఆయన్ను అరెస్టు చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో.. ఆయనకు సంబంధించిన విషయాలు చర్చనీయాంశాలు అయ్యాయి. అయితే.. ఒకప్పుడు శాలువాలు అమ్మే రాజ్ కుంద్రా.. ఈ స్థాయికి ఎలా ఎదిగాడన్నది ఆసక్తికరంగా మారింది.
పంజాబ్ లోని లూథియానాకు చెందిన కుంద్రా కుటుంబం ఆయన చిన్న తనంలోనే లండన్ కు వలస వెళ్లింది. తండ్రి బస్ కండక్టర్. తల్లి షాపులో పనిచేసేవారు. ఈ క్రమంలో ఇరవై ఏళ్ల వయసులో రాజ్ కుంద్రా దుబాయ్ వెళ్లాడు. అక్కడి నుంచి నేపాల్ చేరుకున్నాడు. అక్కడ శాలువాల వ్యాపారం మొదలు పెట్టాడు. కొన్నేళ్లు ఆ బిజినెస్ చేసిన తర్వాత బ్రిటన్ కు చెందిన ఫ్యాషన్ హౌజ్ కంపెనీలకు శాలువాల్ని అమ్మడం ద్వారా బాగా డబ్బు సంపాదించాడు. అనంతరం దుబాయ్ వెళ్లి బిల్డర్ గా అవతరించాడు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి పరిచయాలు మొదలయ్యాయి. దీంతో.. సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఆ విధంగా బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు పెరిగాయి. ఆ విధంగా బాలీవుడ్ లో స్థిరపడ్డాడు. ముంబైలోనే ఉంటూ గేమింగ్, స్పోర్ట్స్ వంటి కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేశాడు. ఇలాంటి సమయంలోనే శిల్పాశెట్టితో పరిచయం కావడం.. అది ప్రేమగా మారడంతో.. మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి, శిల్పను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఆ తర్వాత ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. బెట్టింగ్ వివాదం వంటి అంశాలతో ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇతర రంగాల్లోనూ నష్టాలు వచ్చాయి. దీంతో.. ఆదాయం కోసం బ్లూ ఫిలిమ్స్ వీడియోలు తీసే ముఠాతో సంబంధాలు ఏర్పరుచుకున్నాడట. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందడంతో.. విచారణ చేపట్టిన ముంబై పోలీసులు.. తాజాగా అతన్ని అరెస్టు చేశారు. మొత్తానికి కింది నుంచి వేగంగా ఆకాశానికి ఎదిగిన రాజ్ కుంద్రా.. అంతే వేగంగా పాతాళానికి పడిపోవడం గమనార్హం.