Balakrishna: ఇటీవల సినీ అభిమానం పెరుగుతోంది. హీరోల ఫ్యాన్స్ మధ్య పెద్ద పోరాటమే నడుస్తోంది.తమ హీరో గొప్ప, తమ హీరో సినిమాలు హిట్ అని లేనిపోని కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తుంటారు. అయితే హీరోల మధ్య మాత్రం సహృద్భావ వాతావరణం ఉంటుంది.గతం మాదిరిగా అభిమానులను ప్రోత్సహించడం మాత్రం తగ్గింది. సినిమాను సినిమా వరకు చూసే ఆరోగ్యకరమైన వాతావరణం నడుస్తోంది. అయితే సరిగ్గా ఇటువంటి సమయంలోనే నందమూరి బాలకృష్ణ ఫాన్స్ రచ్చ చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా రకరకాల ప్రచారానికి దిగుతున్నారు. ఇది మంచి వాతావరణాన్ని చెడగొడుతోంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి బాలకృష్ణ ఫ్యాన్స్ నుంచి ఒక రకమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవార్డుల విషయంలో బాలకృష్ణకు అన్యాయం జరుగుతోందని.. ఒక్క సినీ రంగంగానే కాకుండా.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రూపంలో సేవలు.. అటు ఎమ్మెల్యేగా రాజకీయరంగంలో బాలకృష్ణ రాణిస్తున్న విషయాన్ని అభిమానులు ప్రస్తావిస్తున్నారు.అయినా పద్మ అవార్డుల్లో బాలకృష్ణ పేరు పరిగణలోకి తీసుకోకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో చిరంజీవికి అవార్డులు లభించడం పై వారికి మింగుడు పడడం లేదు. తమ హీరోకు కాదని మెగాస్టార్ కు లభించేసరికి రకరకాల కామెంట్స్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి మెగాస్టార్ అభిమానులు రిప్లై ఇస్తుండడంతో ఒక రకమైన ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి దరఖాస్తు చేసుకోవడం వల్లే ఆయనకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని కొందరు బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వివాదానికి కారణమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుతో పాటు కేంద్రంలోని బిజెపి చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు దక్కేలా చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మారుమూల కళాకారులకు సైతం కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ కోవలోనే మెగాస్టార్ చిరంజీవి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లకు గుర్తించి పద్మ విభూషణ్ ప్రకటించింది. దరఖాస్తు చేసే సంస్కృతి ఉండదని.. అత్యున్నత కమిటీ సేవలను గుర్తించి పద్మ అవార్డులకు ఎంపిక చేస్తుందని చిరంజీవి ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే ఇప్పటికే హీరోల మధ్య ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. దానిని చెడగొట్టే విధంగా అభిమానులు వ్యవహరిస్తుండడంపై సినీ పరిశ్రమ ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాటి హీరో సినిమా బాగా ఆడాలని అందరూ కోరుకుంటున్న తరుణంలో.. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించడాన్ని అందరూ ఆహ్వానించాలని సినీ పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అయితే బాలకృష్ణ అభిమానులు రచ్చ రచ్చ చేసి.. తమ అభిమాన హీరోను ఈ వివాదంలోకి లాగుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.