Principal Rupa Reddy: చదువు చెప్పే ఉపాధ్యాయులు అంటే పిల్లలు కచ్చితంగా భయపడతారు. వారు ఎదురుపడితే చాలు వణికి పోతారు. ఇది ఒకప్పటి తరం లో ఉండేది. ఇప్పటి తరంలో అలా కాదు. ఉపాధ్యాయులు అంటే లెక్కలేదు. తల్లిదండ్రులు అంటే భయం లేదు. పాఠశాల లో క్రమశిక్షణతో ఉండాలి అనే సోయి లేదు. సోషల్ మీడియాకు అలవాటు పడి.. సినిమాలను చూసి నేటితరం చాలా వింతగా ప్రవర్తిస్తోంది. అందువల్లే ఈ స్థాయిలో దారుణాలకు పాల్పడుతోంది.
నల్గొండ జిల్లాలోని కొండ మల్లేపల్లి లో నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూపా రెడ్డి కేసులో విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు ఆ ఇద్దరు విద్యార్థులను పోలీసులు జువైనల్ హోమ్ కు తరలించార. కొండమల్లేపల్లి స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి మాత్రమే కాదు.. గతంలో అనేక దారుణాలు పాఠశాలల్లో జరిగాయి. ఇవన్నీ కూడా విద్యార్థులు చేయడం విశేషం. నిజామాబాద్ జిల్లాలో హైస్కూల్ విద్యార్థులు తమ సహచర విద్యార్థిని పై దారుణానికి పాల్పడ్డారు.. వాస్తవానికి విద్యార్థులు పుస్తకాలతో సహవాసం చేయాలి. తోటి విద్యార్థులతో ఆటలాడుకోవాలి.. స్నేహాలు కొనసాగించాలి.. కలలతో నిండిన ప్రపంచంలో విహరించాలి. ఇలా కాకుండా విద్యార్థులు ఇంత దారుణమైన ఘోరాలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. కౌమార దశలో ఉన్న విద్యార్థులు నేర ప్రవృత్తి వైపు వెళ్లిపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
విద్యార్థులలో మద్యం తాగి అలవాటు పెరిగిపోతోంది. మాదకద్రవ్యాలు స్వీకరించే వ్యసనం ఎక్కువ అవుతుంది. పొగాకును వినియోగిస్తున్నారు. దీంతో వారిలో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. అందువల్లే పిల్లలు భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోలేకపోతున్నారు. నిర్ణయ సామర్థ్యం మీద నిలబడలేకపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం.. ఓటీటీలలో హింసతో కూడుకున్న వీడియోలు చూడటం వల్ల విద్యార్థుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. పైగా నేటి కాలంలో సినిమాలలో హింసను ఒక వినోదం లాగా చూపిస్తున్నారు. అశ్లీలాన్ని ఒక సహజమైన ప్రక్రియ లాగా సినిమాల్లో చూపించడం విద్యార్థులు దారితప్పడానికి కారణమవుతోంది.
ఇక జాతీయ నేర గణాంకాల బ్యూరో 2024 లో వెల్లడించిన వివరాల ప్రకారం కౌమార నేరస్తుల జాబితాలో తెలంగాణ తొమ్మిదవ స్థానంలో ఉంది.. ఈ జాబితాలో 5037 మందితో బీహార్ మొదటి స్థానంలో.. 3779 మందితో మహారాష్ట్ర రెండవ స్థానంలో.. 3474 మందితో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో.. 2946 మందితో తమిళనాడు నాలుగు స్థానం, 2827 మందితో రాజస్థాన్ ఐదవ స్థానం, 2695 మందితో ఉత్తరప్రదేశ్ ఆరవ స్థానం, 1427 మందితో ఆంధ్ర ప్రదేశ్ 10వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మంది చిన్నారులలో 8 మంది బాలల నేరస్తులుగా ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఖ్య లక్షకు దాదాపు 14 గా ఉంది. మూడు సంవత్సరాల క్రితం దేశంలో 34,878 మంది బాల నేరస్తులు ఉండగా.. 2024 లో ఆసంఖ్య 11.2 శాతం పెరిగింది.. మొత్తంగా 42, 633 కి చేరుకుంది.