UPI Payments : న్యూఢిల్లీ: యూపీఐ (UPI) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. రూ.2,000 వరకు జరిగే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే రూ.2,000 వరకు RuPay డెబిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులపైనా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేయడానికి వీలు లేదని పేర్కొంది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. Payment and Settlement Systems Act కింద నిబంధనల్లో మార్పులు చేస్తూ ఈ నోటిఫికేషన్ను జారీ చేశారు.
నేరుగా లేదా పరోక్షంగా ఛార్జీలు వద్దు
రూ.2,000 వరకు UPI లేదా RuPay డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసే వ్యక్తుల నుంచి బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలు వసూలు చేయకూడదని ప్రభుత్వం తెలిపింది. చెల్లింపు చేసే వ్యక్తితో పాటు చెల్లింపు స్వీకరించే వ్యక్తిపై కూడా ఇలాంటి ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది.ఈ లావాదేవీలను ప్రభుత్వం అధికారికంగా “ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ పేమెంట్”గా వర్గీకరించింది.
UPIపై వినియోగదారులకు ఛార్జీలు లేవు
ఇటీవల UPI చెల్లింపులపై ఛార్జీలు విధించే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ స్పష్టత ఇచ్చింది. వినియోగదారులు UPI ద్వారా చెల్లింపులు చేసేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని గత నెలలోనే ప్రభుత్వం వెల్లడించింది.
ముఖ్యంగా Person-to-Person (P2P) UPI లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాపారులపై కూడా అన్ని UPI లావాదేవీలకు వర్తించే విధంగా ఎలాంటి blanket Merchant Discount Rate (MDR) విధించబోమని స్పష్టం చేసింది.
కొన్ని లావాదేవీలకు మాత్రమే MDR అవకాశం
భవిష్యత్తులో నిర్దిష్ట పరిమితికి మించిన కొన్ని UPI వ్యాపార లావాదేవీలపై మాత్రమే MDR విధించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఛార్జీలు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లావాదేవీలపై ప్రస్తుతం వర్తించే MDRతో పోలిస్తే గణనీయంగా తక్కువగా ఉంటాయని పేర్కొంది.
వినియోగదారులకు భారీ ఊరట
దేశవ్యాప్తంగా రోజువారీ చెల్లింపులకు UPI వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం తాజా స్పష్టత వినియోగదారులకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ముఖ్యంగా చిన్న మొత్తాల చెల్లింపుల్లో అదనపు ఛార్జీల భారం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో UPI వినియోగం మరింత సులభంగా కొనసాగనుంది.
ఇటీవల Payment and Settlement Systems Act, 2007లో చేసిన సవరణలపై UPI వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆ సందేహాలకు కేంద్రం స్పష్టత ఇచ్చింది.