UPI Charges: భారతదేశంలో మనీ ట్రాన్జాక్షన్ డిజిటల్ మయంగా మారింది. కిరాణం కొట్టు నుంచి పెద్ద మొత్తంలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే ఇటీవల యూపీఐ చెల్లింపులపై చార్జీలు పడే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చార్జీలతో ఇక ఇబ్బందులే అనుకున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. యూపీఐ చెల్లింపుల్లో ఎవరికీ చార్జీలు వర్తిస్తాయి? ఎవరికి వర్తించవు? అనే వివరాల్లోకి వెళితె..
దేశంలో డిజిటల్ పేమెంట్స్పై శుక్రవారం పార్లమెంట్ లో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లో మార్పులకు ఆమోదం తెలిపారు. అయితే దీనర్థం ఇకపై ప్రతి యూపీఐ పేమెంట్కూ వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని కాదు. మరి చార్జీలు ఎలా ఉంటాయంటే?
ఒక కస్టమర్ డిజిటల్ పేమెంట్ ద్వారా వ్యాపారికి డబ్బులు చెల్లించినప్పుడు, ఆ లావాదేవీని ప్రాసెస్ చేయడానికి పేమెంట్ ఎకోసిస్టమ్లోని సంబంధిత సంస్థలకు వ్యాపారి తరఫున చెల్లించే రుసుమును MDR(Merchant Discount Rate) అంటారు. ఇందులో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర పేమెంట్ మౌలిక వసతుల సంస్థలకు సంబంధించిన ఖర్చులు ఉండొచ్చు. ముఖ్యంగా ఇది సాధారణంగా కస్టమర్ నుంచి నేరుగా వసూలు చేసే ఛార్జీ కాకుండా వ్యాపార లావాదేవీపై వర్తించే ఫీజుగా ఉంటుంది.
2019లో పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ లోని సెక్షన్ 10 ఏ ద్వారా నిర్దిష్ట ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాల ద్వారా డబ్బులు చెల్లించేవారికి.. డబ్బులు పొందేవారిపై బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు నేరుగా లేదా పరోక్షంగా ఛార్జీలు విధించకుండా నిబంధనలు తీసుకొచ్చారు. యూపీఐ, రూపే డెబిట్ కార్డులను ఈ విధానాల్లో చేర్చారు. 2025లో కేంద్ర ప్రభుత్వం లోక్సభకు ఇచ్చిన సమాధానంలో కూడా యూపీఐపై ప్రస్తుతం ట్రాన్సాక్షన్ ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని తెలిపింది.
అయితే తాజాగా లోక్సభ ఆమోదించిన చట్ట సవరణతో ప్రభుత్వం భవిష్యత్తులో కొన్ని ఎలక్ట్రానిక్ పేమెంట్ లావాదేవీలకు చార్జీలకు అనుమతి అవకాశం ఉంది. కానీ ఈ చార్జీలు వెంటనే అమలులోకి వస్తాయని కాదు. ఏ లావాదేవీలకు, ఎంత మొత్తంలో, ఎవరిపై ఛార్జీ విధించాలి అనే విషయాలను ప్రభుత్వం తరువాత నిర్ణయించాల్సి ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితిలో సాధారణ యూపీఐ వినియోగదారులు రోజువారీ కొనుగోళ్లలో చేసే పేమెంట్స్పై చార్జీలు వసూలు చేసే విధానం ఇప్పటికీ అమల్లోకి రాలేదు. కానీ ప్రభుత్వం MDRను అనుమతిస్తే.. అదీ కూడా వ్యాపార లావాదేవీలపై ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యాపారి యూపీఐ ద్వారా కస్టమర్ నుంచి రూ.10,000 స్వీకరిస్తే, నిర్ణయించిన ఎండీఆర్ రేటు ప్రకారం కొంత మొత్తాన్ని పేమెంట్ సిస్టమ్కు చెల్లించాల్సి రావచ్చు. అయితే ఎంత శాతం చెల్లించాలి? ఏ రకాల వ్యాపారులకు వర్తించాలి? అనే అంశాలపై తుది నిబంధనలు స్పష్టంగా రావాల్సి ఉంది.