TDP : రాజకీయ పార్టీల మధ్య స్నేహం అనేది చాలా కీలకం. మిత్రపక్షాలు అంటేనే ఉభయ పార్టీలు కలిసి పోవాలి. ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. బిజెపి విషయాన్ని పక్కన పెడితే.. టిడిపి, జనసేనల మధ్య బంధం పెరిగింది. ఒకప్పుడు ఆ రెండు పార్టీల మధ్య స్నేహం చిగురించిందే కానీ.. ఒక రకమైన గ్యాప్ ఉండేది. కానీ దానిని తగ్గించగలిగారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. నిన్ననే పవన్ జన్మదినోత్సవం నాడు అది స్పష్టంగా కనిపించింది. సీఎం చంద్రబాబు నుంచి సామాన్య టిడిపి కార్యకర్త వరకు పవన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు, పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న తీరు చూస్తుంటే మహారాష్ట్ర, ఒడిస్సా రాజకీయం గుర్తుకు వస్తోంది. మహారాష్ట్రలో దశాబ్దాలుగా బిజెపితో కలిసి నడిచింది శివసేన. అక్కడ పార్టీలు మాత్రమే రెండు. కానీ ఒకటి అన్నట్టు దశాబ్దాల కాలం పాటు నడిచాయి ఆ రెండు పార్టీలు. ఒడిస్సాలో కూడా అంతే. బిజెపి, డీ జోడి దాదాపు 25 సంవత్సరాల పాటు కలిసి నడిచాయి. ఆ రెండు పార్టీల మధ్య స్నేహం కూడా అలానే ఉండేది. ఇప్పుడు ఆ జాబితాలో టిడిపి – శివసేన చేరాయి.
* మద్దతుగా ప్రారంభం అయిన స్నేహం..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ సమయంలో తన పార్టీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. కానీ ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. అప్పట్లో రాష్ట్రంలో టిడిపికి.. జాతీయస్థాయిలో బిజెపికి మద్దతు తెలిపారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో కేవలం స్నేహం మాత్రమే కొనసాగించారు. 2019లో వామపక్షాలతో కలిసి వెళ్లారు పవన్. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బిజెపితో స్నేహం ప్రకటించారు. కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీని అధికారికంగా మిత్రపక్షమని ప్రకటించారు. అది మొదలు ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీతో ప్రతిపక్షంగా కొనసాగుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్.
* అనుమానాలన్నీ పటాపంచలు..
అయితే ప్రారంభంలో అంతా భావించారు పవన్ కళ్యాణ్ ఎక్కువ రోజులు చంద్రబాబుతో స్నేహం కొనసాగించలేరని. ఎక్కువ రోజులు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండదన్న వారే అధికం. అలాగే పవన్ అంటే టిడిపి శ్రేణులకు పెద్దగా నచ్చేది కాదు. చంద్రబాబు అంటే జనసేన శ్రేణులకు నమ్మకం ఉండేది కాదు. ఎన్నికలకు ముందు పొత్తు, సీట్ల సర్దుబాటు, గెలిచిన తర్వాత పవర్ షేరింగ్, మంత్రివర్గ కూర్పు ఇలా అన్నింట ఎక్కడో చోట విభేదాలు ఏర్పడతాయి అన్నది వ్యతిరేకులు అంచనా. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ముందుకు సాగారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ రెండేళ్లలో ఆ రెండు పార్టీల్లోనూ స్పష్టమైన మార్పు కనిపించింది. పేరుకే రెండు పార్టీలు కానీ.. ఒకే ఒక్క అభిప్రాయంతో ముందుకు సాగుతున్నాయి ఆ రెండు పార్టీలు. నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో టిడిపి శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు గోదావరి జలాలను విడుదల చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజును సైతం గుర్తు చేసుకున్నారు. అంతలా రెండు పార్టీల మధ్య బంధం పెరిగింది అని చెప్పవచ్చు.