Punjab National Bank : తీగ లాగితే డొంకంతా కదిలిన సామెతను మీరు ఎప్పుడైనా విన్నారా.. పోనీ నిజ జీవితంలో మీకు ఎప్పుడైనా ఆ సామెత అనుభవంలోకి వచ్చిందా.. మీ సంగతేమో గాని.. ఆ అధికారులకు మాత్రం వాస్తవంలో బోధపడింది. పైగా ఒక సాధారణ వ్యవహారాన్ని పరిష్కరించడానికి రంగంలోకి దిగిన వాళ్లకు.. కోట్ల మోసం జరిగిన తీరు బయటపడింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సహారన్ పూర్ ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు కరెన్సీ చెస్ట్ ఉంది. ఇక్కడి నుంచే నగదును ఇతర బ్యాంకులకు సరఫరా చేస్తుంటారు. ఈ బ్యాంకులో ఇటీవల ఆడిటింగ్ నిర్వహించారు. దాదాపు 4.36 లక్షలు తేడా వచ్చిందని తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తుంటే మరో దారుణమైన విషయం వెలుగు చూసింది. ఏకంగా 7.4 కోట్ల విలువైన నకిలీ నోట్ల మోసం బయటపడింది. సహరన్ పూర్ ప్రాంతంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ నగదు నిల్వ కేంద్రంలో ఈ మోసం చోటు చేసుకుంది.
గత నెల 10న ఇక్కడి నగదు నిల్వ కేంద్రం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు అధికారులు కొంత డబ్బు పంపించారు. ఈ డబ్బులో 4.6 లక్షలు తక్కువ వచ్చాయి.. ఆర్బిఐ అధికారులు వెంటనే ఆడిటింగ్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ తనిఖీలు చేస్తున్నప్పుడే 7.4 కోట్ల విలువైన నకిలీ నోట్లు బయటికి వచ్చాయి. కొంతమంది వ్యక్తులు కావాలని నకిలీ నోట్లను అక్కడ పెట్టి.. అసలు నోట్లను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో బ్యాంక్ సీనియర్ డివిజనల్ మేనేజర్ రవికుమార్, కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ మేనేజర్లు సుశీల్ శర్మ.. అమిత్ కుమార్.. ఇంకా మరికొందరిని అనుమానితులుగా పోలీసులు పేర్కొన్నారు. కేసులు కూడా నమోదు చేశారు.
దాదాపు 7.4 కోట్ల నకిలీ నోట్లను అక్కడ పెడుతుంటే అధికారులు ఏం చేశారు.. అక్కడ సీసీ కెమెరాలు లేవా.. నగదు నిల్వ కేంద్రంలో భద్రత ఎండమావేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జాతీయ మీడియాలో కూడా వార్తలు ప్రసారమయ్యాయి. ఇప్పటివరకు ఈ కేసులో కేవలం అనుమానితులను మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే గాని అసలు విషయం బయటపడుతుందని పోలీసులు అంటున్నారు.
సాధారణంగా మన నగదుకు భద్రత ఉంటుందని.. మన బంగారానికి భరోసా ఉంటుందని బ్యాంకులను ఆశ్రయిస్తూ ఉంటాం. బ్యాంకుల దగ్గర ఉండే నగదు నూటికి నూరు శాతం నాణ్యమైనదని భావిస్తూ ఉంటాం. కానీ చెస్ట్ బ్రాంచ్ లోనే నకిలీ నోట్లు ఉన్నాయంటే దాన్ని ఏమనుకోవాలి.. అధికారుల నిర్లక్ష్యం వల్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ పరువు మొత్తం పోయింది. ఈ వ్యవహారంలో అధికారులు ఎటువంటి దిద్దుబాటు చర్యలకు దిగుతారనేది చూడాల్సి ఉంది.