Maruti Suzuki EV : మారుతి సుజుకి నుంచి మరో ఎలక్ట్రిక్ కారు రాబోతోందా? ప్రస్తుతం భారత మార్కెట్లో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్కు అనుగుణంగా దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కీలక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈవిటారా (eVitara)తో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టిన సంస్థ.. ఇప్పుడు సామాన్య వినియోగదారులను టార్గెట్ చేస్తూ రూ.10 లక్షల్లోపు ధరలో మరో ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తే టాటా టియాగో ఈవీకి నేరుగా పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
రూ.8.5 లక్షల నుంచి రూ.10.5 లక్షల వరకు ధర?
ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం.. మారుతి సుజుకి కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారును ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనం కోసమే రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న పెట్రోల్ కారును ఎలక్ట్రిక్ వెర్షన్గా మార్చడం కాకుండా.. ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్కు అనుగుణంగా కొత్త ప్లాట్ఫామ్పై ఈ కారును అభివృద్ధి చేసే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాటరీ ప్లేస్మెంట్, క్యాబిన్ స్పేస్, బరువు వంటి అంశాలను మెరుగ్గా ఆప్టిమైజ్ చేయవచ్చని భావిస్తున్నారు.
ఈ కారు ధరను సుమారు రూ.8.5 లక్షల నుంచి రూ.10.5 లక్షల మధ్యలో ఉంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అధిక స్థాయి లోకలైజేషన్, చిన్న బ్యాటరీ ప్యాక్ వినియోగం ద్వారా తయారీ వ్యయాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
250-315 కిలోమీటర్ల రేంజ్?
ఖరీదైన ఎలక్ట్రిక్ ఎస్యూవీల మాదిరిగా భారీ రేంజ్ను అందించడంపై కాకుండా.. నగరాలు, శివారు ప్రాంతాల్లో రోజువారీ ప్రయాణాలకు సరిపోయే విధంగా ఈ కారును రూపొందించే అవకాశం ఉంది. ప్రస్తుతం 250 నుంచి 315 కిలోమీటర్ల వరకు రేంజ్ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ రేంజ్ టాటా టియాగో ఈవీకి సమీపంగా ఉండటంతో.. రెండు మోడళ్ల మధ్య నేరుగా పోటీ ఏర్పడే అవకాశం ఉంది.
అరేనా షోరూమ్ల నుంచే విక్రయాలు?
మారుతి సుజుకి కొత్త ఎలక్ట్రిక్ కారును ప్రీమియం నెక్సా షోరూమ్ల ద్వారా కాకుండా.. సాధారణ వినియోగదారులకు చేరువగా ఉన్న అరేనా నెట్వర్క్ ద్వారా విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈవిటారా నెక్సా డీలర్షిప్ల ద్వారా విక్రయించబడుతోంది. కొత్త చిన్న ఈవీని అరేనా నెట్వర్క్లోకి తీసుకురావడం ద్వారా వాగన్ఆర్, స్విఫ్ట్ వంటి కార్లను కొనుగోలు చేసే కస్టమర్లను కూడా ఎలక్ట్రిక్ విభాగంలోకి ఆకర్షించాలనేది కంపెనీ వ్యూహంగా కనిపిస్తోంది.
సుజుకి ఈ-స్కైతో పోలిక
సుజుకి ఇటీవల వెల్లడించిన ఈ-స్కై కాన్సెప్ట్ కూడా కంపెనీ భవిష్యత్తులో చిన్న, అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కార్లపై దృష్టి పెడుతున్నట్లు సూచిస్తోంది. ఈ-స్కై 3,395 మిల్లీమీటర్ల పొడవు, 2,460 మిల్లీమీటర్ల వీల్బేస్తో ఉంటుంది. సుమారు 1,030 కిలోల బరువుతో, 26kWh బ్యాటరీని ఉపయోగిస్తూ 310 కిలోమీటర్ల వరకు రేంజ్ను అందిస్తుందని సుజుకి వెల్లడించింది. అయితే భారత మార్కెట్ కోసం మారుతి అభివృద్ధి చేస్తున్న కొత్త ఈవీకి, ఈ-స్కైకి అధికారిక సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ధృవీకరణ లేదు.
టయోటా బ్యాడ్జ్తోనూ వచ్చే అవకాశం?
కొత్త మారుతి ఈవీని టయోటా బ్రాండ్ పేరుతో కూడా తీసుకురావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మారుతి సుజుకి ఇప్పటికే టయోటాతో పలు మోడళ్ల విషయంలో భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశం చర్చకు వస్తోంది.
భారత్లో పెరుగుతున్న ఈవీ మార్కెట్
దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 2026 జూలైలో భారత్లో మొత్తం 32,928 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు రిటైల్ అమ్ముడయ్యాయి. 2025 జూలైలో నమోదైన 17,981 యూనిట్లతో పోలిస్తే ఇది 83.13 శాతం వృద్ధి.
జూలై 2026లో టాటా మోటార్స్ 13,678 ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలతో 41.54 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. మహీంద్రా 7,742 యూనిట్లతో 23.51 శాతం వాటాను, జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ 5,689 యూనిట్లతో 17.28 శాతం వాటాను నమోదు చేశాయి. మారుతి సుజుకి సుమారు 1,600 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి 4.86 శాతం మార్కెట్ వాటాను సాధించింది.
ఈ నేపథ్యంలో రూ.10 లక్షల్లోపు ధరలో చిన్న ఈవీని మారుతి తీసుకొస్తే.. కంపెనీకి భారీ మాస్ మార్కెట్ను చేరుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా తక్కువ ధర, మారుతి సుజుకి విస్తృత సర్వీస్ నెట్వర్క్, పట్టణ ప్రయాణాలకు సరిపోయే రేంజ్ వంటి అంశాలు ఈ కారుకు కలిసొచ్చే అవకాశముంది. అయితే కొత్త మోడల్ పేరు, బ్యాటరీ సామర్థ్యం, ఫీచర్లు, ఖచ్చితమైన ధర, విడుదల తేదీ వంటి వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.