Kia Syros EV: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరో సంచలనం మొదలైంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ని ఆవిష్కరించింది. ఈ కారు మార్కెట్లోకి రాకముందే ముఖ్యంగా దీని మైలేజ్ పరంగా వాహన ప్రియుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది. ఈ సరికొత్త ఈవీ కారు మైలేజ్, బ్యాటరీ సామర్థ్యం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే బ్యాటరీతో ఏకంగా 526 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. ఇంతకీ ఇది ఏ కారు అంటే?
కియా కంపెనీ నుంచి ‘కియా సైరోస్ ఈవీ’ త్వరలో మార్కెట్లోకి రానుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 526 కిలోమీటర్ల గరిష్ట రేంజ్ ను అందిస్తుంది. ఈ రేంజ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ సెగ్మెంట్లోనే అత్యధికం కావడంతో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంటే మీరు సిటీలో ఆఫీస్ ప్రయాణాలకే కాకుండా, లాంగ్ ట్రిప్స్కు కూడా ఎలాంటి రేంజ్ ఆందోళన లేకుండా హాయిగా ప్రయాణించవచ్చు.
ఈ కారులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి 51.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉండగా.. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 526 కిమీ వరకు ప్రయాణం చేయొచ్చు. మరొకటి 42 kWh బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఇది బడ్జెట్ తో పాటు సిటీ డ్రైవింగ్ కోరుకునే వారి కోసం. ఇది సింగిల్ ఛార్జ్పై 443 కిమీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు మైలేజ్ ఎంత ఎక్కువో, దీని ఛార్జింగ్ వేగం కూడా అంతే అద్భుతం. ఇందులో 100 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీని సహాయంతో కేవలం 39 నిమిషాల్లోనే బ్యాటరీని 10 శాతం నుండి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఇంట్లో ఛార్జ్ చేసుకోవడం కోసం 11 kW AC ఆన్బోర్డ్ ఛార్జర్ కూడా లభిస్తుంది. దీని ద్వారా దాదాపు 4 నుండి 5 గంటల్లో కారు పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
కియా సైరోస్ ఈవీ మైలేజ్ను పెంచడంలో దీనిలోని ఐ-పెడల్ (i-Pedal) మోడ్ రీజెనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తాయి. మనం బ్రేక్ వేసినప్పుడు లేదా యాక్సిలరేటర్ వదిలేసినప్పుడు వృథా అయ్యే ఎనర్జీని ఇది తిరిగి బ్యాటరీ ఛార్జింగ్ కోసం వాడుకుంటుంది. తద్వారా మైలేజ్ మరింత పెరుగుతుంది. ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే.. పెద్ద బ్యాటరీ వేరియంట్ కేవలం 8.1 సెకన్లలోనే 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
మైలేజ్తో పాటు లుక్స్, ఫీచర్స్ పరంగా కూడా సైరోస్ ఈవీ టాప్గా నిలిచింది. ఇందులో కియా సిగ్నేచర్ డిజిటల్ టైగర్ ఫేస్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ , ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. కారు లోపల 30 అంగుళాల పనోరమిక్ డిస్ప్లే ను చేర్చారు. హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. భద్రత కోసం లెవెల్ 2 ADAS , 6 ఎయిర్బ్యాగ్లు, 360 డిగ్రీ కెమెరాలను అందించారు.
ఈ అదిరిపోయే ఫీచర్లు, సూపర్ మైలేజ్ గల కియా సైరోస్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14 లక్షల నుంచి విక్రయిస్తున్నారు. ఇది భారత మార్కెట్లోకి వచ్చాక టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV), మహీంద్రా XUV 400 మరియు టాటా పంచ్ ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
